ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో విప్లవాత్మక మార్పులు

23 Aug, 2022 05:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. సోమవారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ వైద్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణబాబు మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలుకు అవసరమైన వసతులను సమకూరుస్తున్నామన్నారు. పీహెచ్‌సీలన్నింటిలో ఇద్దరు చొప్పున వైద్యులను నియమించామన్నారు.

ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు ఇప్పటికే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. డిసెంబర్‌ నాటికి అన్ని క్లినిక్‌లకు సొంత భవనాలు సమకూరుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ నివాస్, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్కుమార్, ఆరోగ్యశ్రీ, సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్‌ డాక్టర్‌ ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు