దిగుబడి బాగున్నా.. దిగిరాని ధరలు 

21 Aug, 2020 12:22 IST|Sakshi

టమాట దోబూచులాట

అర్ధ సెంచరీ దాటిన పచ్చిమిరప  

అన్ని రకాల కూరగాయల రేట్లు పైపైకి  

క​డప అగ్రికల్చర్‌: కూరగాయల దిగుబడులు బాగున్నా ధరలు దిగిరావడం లేదు. చిన్న హోటళ్ల వారు ఈ ధరలను చూసి కూరలను తయారు చేయడం తగ్గించారు. పచ్చళ్లను వండి పార్శిల్‌ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో రూ.10–15లోపే ఉన్న కూరగాయల ధరలు రూ.30 నుంచి 60కి ఎగబాకాయి. దీంతో వినియోగదారులు వాపోతున్నారు.  జిల్లాలో పంటల సాగు పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో కాస్త తక్కువగా ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదల కారణంగా పంట దెబ్బతినడంతో అక్కడికి కూరగాయలను తరలిస్తుండడంతో మార్కెట్‌ కొరత కారణంగా తగ్గుతున్నాయని వ్యాపారులు సమర్ధించుకుంటున్నారు. పంటల సాగు పెరిగినా ధరలు ఎందుకు తగ్గడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. కిలో రూ.10–15 ఉన్న టమాట ధర కూడా రూ.30లకు చేరింది.  

మార్కెట్‌లో వ్యాపారులు దళారుల మాయాజాలం...: 
జిల్లాలో రోజుకు 5 నుంచి 6 టన్నుల కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని ఉద్యానశాఖ అధికారుల అంచనా. మార్కెట్లో కొరతను సాకుగా చూపుతూ ధరలు పెంచి వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రవాణా, ఇతర ఖర్చులు పోయినా ధరలు బాగా ఉండడంతో అక్కడికి తరలించడంతో ఆదాయం ఉంటోందని వ్యాపారులు అంటున్నారు.   

కూరగాయల సాగు విస్తీర్ణం  హెక్టార్లలో  : 4,000  
జిల్లాకు అవసరమైన కూరగాయలు :  10.80 టన్నులు
ప్రస్తుతం  వినియోగిస్తున్నవి : 6 టన్నులు
జిల్లాలో కొరత :  5 టన్నులు 

మరిన్ని వార్తలు