కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రూ.25 లక్షల పరికరాలు

24 May, 2021 04:55 IST|Sakshi

నగరి: చిత్తూరు జిల్లా పుత్తూరు కేకేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రూ.25 లక్షల విలువైన వైద్య పరికరాలను ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ట్రస్టు ద్వారా అందజేశారు. నగరిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం ఆమె సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి ఈ వైద్య పరికరాలను కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి, డీఆర్‌డీఏ పీడీ తులసి, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ రవిరాజుకు అప్పగించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో రోగులు ఇబ్బంది పడకుండా 15 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను బెంగళూరుకు చెందిన మిన్‌త్రా కార్పొరేట్‌ సంస్థ సీఆర్వో అమర్‌.. ఆర్కే రోజా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అందజేశారు.

విజయపురం పీహెచ్‌సీకి కావాల్సిన వైద్యపరికరాలను కూడా అందించారు. మిన్‌త్రా కార్పొరేట్‌ సంస్థ సీఆర్వో అమర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేస్తున్న సేవలకు ప్రభావితమై తాను కూడా సహకారం అందించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు.  డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ కేకేసీ కళాశాలలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అక్కడ రోగులకు మాత్రల నుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వరకు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే అందజేస్తున్నారని చెప్పారు.  

మరిన్ని వార్తలు