ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్‌ఓ పట్టించుకోలేదు: వెన్నపూస రవీంద్రారెడ్డి

20 Mar, 2023 08:03 IST|Sakshi

అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ), కలెక్టర్‌ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు.

‘కౌంటింగ్‌ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌ ప్రవీణ్, కమలాపురం ఇన్‌చార్జ్‌ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్‌ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్‌ హాల్లోని ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్‌ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా

ఏమన్నారంటే.. 
మాజీ సీఎం చంద్రబాబు ఫోన్‌ చేస్తే కలెక్టర్‌ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా?  
కౌంటింగ్‌ హాల్లో టేబుల్‌ నంబర్‌ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్‌ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది.  
అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్‌ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్‌ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు.  
► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్‌ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు.
చదవండి: ‘స్కిల్‌’ సూత్రధారి బాబే 

మరిన్ని వార్తలు