సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర శివారు ఎండాడ వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. సమీప ప్రాంతాల్లో సీసీటీవి ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో కానిస్టేబుల్ సంతోష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని నగర కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే రేవళ్లపాలెంలోని సీఐ భార్య కుటుంబ సభ్యులను సీపీ పరామర్శించారు.
విజయసాయిరెడ్డి సంతాపం
విధినిర్వహణలో ఉండగా అనూహ్యంగా రోడ్డు ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయిన విశాఖ త్రీటౌన్ శాంతి భద్రతల సీఐ కరణం ఈశ్వర్ రావు మృతిపట్ల ఎంపీ విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘విధినిర్వహణలో విశాఖ త్రీటౌన్ శాంతి భద్రతల సీఐ కరణం ఈశ్వర్ రావు గారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అంకిత భావంతో, పేదల పక్షపాతిగా, స్నేహపూర్వకంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం’అని ట్విటర్లో పేర్కొన్నారు.