AP: అక్టోబర్‌ 1 నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పేస్కేల్‌

1 Oct, 2022 07:53 IST|Sakshi

52వేల మంది ఆర్టీసీ సిబ్బందికి మరింత ప్రయోజనం

ప్రభుత్వంపై ఏటా అదనపు ఆర్థికభారం రూ.360 కోట్లు

జీతాల కోసం ప్రభుత్వం ఏడాదికి చెల్లించేది రూ.3,960 కోట్లు

సాక్షి, అమరావతి : ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు నేటి (అక్టోబరు 1) నుంచి ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని గతంలోనే ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫలితంగా ఆర్టీసీపై ఉద్యోగుల జీతాల చెల్లింపు భారం తొలగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పే స్కేల్‌ను కూడా వర్తింపజేయడంతో దాదాపు 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలగనుంది. పే స్కేల్‌ నిమిత్తం ఆర్టీసీ ఉద్యోగుల కేడర్‌ను కూడా ఇప్పటికే ఖరారుచేశారు.

ఇక దర్జాగా ప్రభుత్వ జీతాలు
ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ప్రతినెలా ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఉండేది. ఆ అప్పుల మీద వడ్డీ భారమే ఏడాదికి రూ.350 కోట్లు చెల్లించాల్సి రావడంతో ఆర్టీసీ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీని 2020, జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేసింది. అప్పటి నుంచి దాదాపు 52 వేలమంది ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్లు వెచ్చించింది.

ఇలా ఇప్పటికి రెండేళ్ల 9 నెలల్లో రూ.9,900 కోట్లను ప్రభుత్వం జీతాల కింద చెల్లించింది. ప్రభుత్వ కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాల చెల్లింపుతో సర్కారుపై ఏడాదికి రూ.360 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, మొత్తం మీద రూ.3,960 కోట్ల ఆర్థికభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు.. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే పలు ప్రయోజనాలూ పొందుతున్నారు.
చదవండి: ఏపీలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

మరిన్ని వార్తలు