ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్‌ఎంఎస్‌లు

30 Sep, 2020 19:32 IST|Sakshi

రైతు సంక్షేమానికి సీఎం జగన్‌ మరో ముందడుగు

ఆర్‌బీకేల్లో పీఓఎస్‌ వెర్షన్‌ ప్రారంభం 

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సదానంద గౌడ

సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) వెర్షన్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసును బుధవారం కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా పాల్గొన్నారు. ఇక నుంచి రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) నుంచి ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుతుంది. అదే విధంగా ఆ ఎరువులను రైతుల ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు. 


క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం వల్ల రైతులు అధికోత్పత్తి సాధించగలుగుతారు. అంతే కాకుండా వారికి సాగు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు.
(చదవండి: 1న గిట్టుబాటు ధరల ప్రకటన)

రైతు భరోసా కేంద్రాలు:
‘రైతులకు సాగులో మరింత తోడ్పాటు ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటి నిర్వహణ బాధ్యత కోసం బీఎస్సీ (అగ్రికల్చర్‌) గ్రాడ్యుయేట్లను వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, ఆక్వా సహాయకులుగా నియమించడం జరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఆర్‌బీకేలు అనేక మార్పులకు కేంద్రాలుగా నిల్చాయి. వ్యవసాయంతో పాటు, హార్టికల్చర్, సెరీ కల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, సహకార, నీటిపారుదల తదితర రంగాలన్నింటిలోనూ సేవలకు ఒకే వేదికగా ఆర్‌బీకేలు పని చేస్తున్నాయి. ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు, పశు సంవర్థక, మత్స్యసాగుకు అవసరమైన వాటిని కూడా ఆర్బీకేల ద్వారా అందజేయడం జరుగుతోంది.


అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వారికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చేందుకు ఆర్బీకేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది మే 30న ఒకేసారి 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాము. వాటిలో డిజిటల్‌ కియోస్క్, స్మార్ట్‌ టీవీ, వైట్‌ బోర్డు, కుర్చీలు, డిజిటల్‌ లైబ్రరీతో పాటు, భూసార పరీక్షకు అవసరమైన ఉపకరణాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను డిజిటల్‌ కియోస్క్‌ల ద్వారా బుక్‌ చేసుకుంటే, వారికి 24 గంటల నుంచి 48 గంటలలోగా వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. పంటల సాగు, పురుగు మందుల వాడకంపై రైతులకు వీడియోల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు స్మార్ట్‌ టీవీలు ఉపయోగించడం జరుగుతోంది.
(చదవండి: మోదీ కేబినెట్‌లోకి రామ్‌ మాధవ్‌, మురళీధర్‌రావు?)

ప్రత్యేక కాల్‌ సెంటర్‌:
ఇంకా ఆర్‌బీకేల వద్ద ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను నెం:155251 తో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్‌కు ఇప్పటి వరకు రైతుల నుంచి 46,500 కాల్స్‌ వచ్చాయి. 

ఆర్బీకేలు–ఈ క్రాపింగ్‌:
కోవిడ్‌ సమయంలోనూ 15 రకాల పంటలకు సంబంధించి 6.9 లక్షల టన్నుల విత్తనాలను 13.64 లక్షల రైతులకు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈ–క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 49.14 లక్షల రైతుల పేర్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి 1.12 కోట్ల ఎకరాలలో సాగు చేస్తున్న పంటల పూర్తి వివరాలు నమోదు చేయడం జరిగింది. ఈ ఖరీఫ్‌కు సంబంధించి  కాకతాళీయంగా ఈ–క్రాపింగ్‌ నమోదుకు ఇవాళే ఆఖరి రోజు కావడం విశేషం.

ఆర్బీకేల పాత్ర:
వ్యవస్థలో మరింత పారదర్శకత, సోషల్‌ ఆడిట్‌ ద్వారా వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, వివిధ పథకాలలో లబ్ధి పొందిన, పొందుతున్న రైతుల వివరాలను ప్రదర్శించడంలో కూడా ఆర్‌బీకేలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్‌ ఇంటలిజెన్స్, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లకు సంబంధించిన సమాచారం అందించడం, రైతుల సందేహాలు తీర్చడంలో కూడా ఆర్‌బీకేలు పని చేస్తున్నాయి. ఇంకా ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా ఆర్బీకేలు పని చేయనున్నాయి.

ఇన్‌పుట్‌ సరఫరా:
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, పశు గ్రాస విత్తనాలు, చేపల ఫీడ్‌ తదితర అవసరాలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 2.17 లక్షల ఆర్డర్లు రాగా, 69,561 మెట్రిక్‌ టన్నులు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఎక్కువగా నగదు లావాదేవీలతో కొనసాగుతున్నప్పటికీ ఆర్‌బీకేల వద్ద ఆ స్థాయిలో 2.17 లక్షల ఆర్డర్లు రావడం, వాటిపై రైతులకు నమ్మకం చూపుతోంది. 
తగిన ధరలో నాణ్యమైనవి సరఫరా చేయడమే అందుకు కారణం. డిజిటల్‌ పేమెంట్లు కూడా ఆర్‌బీకేల వద్ద అనుమతిస్తున్నారు. ఇప్పటికే 38 వేల ఆర్డర్లకు డిజిటల్‌ పేమెంట్లు జరిగాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులకు సంబంధించి 2 లక్షల ఆర్డర్లు రాగా, సరఫరా చేయడం జరిగింది.

రైతులకు సాగు పెట్టుబడి:
రైతులకు పాగు పెట్టుబడిగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.13,500. ఇస్తున్నాము. తొలుత ఖరీఫ్‌ ప్రారంభంలో రూ.7500, ఆ తర్వాత రబీ ప్రారంభంలో మరో రూ,4 వేలు, ఆ తర్వాత సంక్రాంతికి పంటలు చేతికొచ్చే నాటికి మరో రూ.2 వేలు ఇస్తున్నాము. ఆ మొత్తం చాలా మంది రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ మాత్రమే కాకుండా, అవి ధాన్యం సేకరణ కేంద్రాల మాదిరిగా కూడా పని చేప్తాయి, ఈ–క్రాపింగ్‌ పక్కాగా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్న ఎస్‌ఎంఎస్‌ సర్వీస్, ఎరువుల డోర్‌ డెలివరీ రైతులకు మరింత మేలు చేయనుంది’అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది: డీపీ సదానందగౌడ
‘ఏపీలో ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషం. కేంద్రం అమలు చేసే ఏ పథకానికి అయినా ఏపీ చాలా సహకరిస్తోంది. మా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. కోవిడ్‌ సంక్షోభంలోనూ రైతులకు మేలు చేయడంలో వెనక్కి తగ్గలేదు. పీఎం విజన్‌ ప్రకారం, కోవిడ్‌ సమయంలోనూ చక్కగా సేవలందించాం. రాష్ట్రంలో ఇంకా ఎరువులు, పురుగు మందులు కావాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పలుమార్లు కోరారు. ఆ మేరకు మేము కూడా సహకరించాము. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) బాగా సక్సెస్‌ అయింది. సేవలకు సంబంధించి 65 శాఖల్లో మా శాఖ రెండో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. మా పరిపాలనతో పూర్తి పారదర్శకత, పంపిణీ చేసే ఎరువులో ఎక్కడా అవకతవకలు జరగవు. ఎక్కడా లీకేజీ ఉండదు. రోజు రోజుకూ ఇంకా పక్కాగా సేవలందిస్తున్నాము. ఇవాళ రైతులకు ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌తో పాటు, ఎరువుల హోం డెలివరీ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ విధంగా మా శాఖ మారుమూల గ్రామాల్లో సైతం సేవలందించనుంది. రైతులకు మేలు చేయడంతో పాటు, ఈ రంగంలో సంస్కరణల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందంజలో ఉంది. ఇవాళ ఈ రెండింటితో ఆ సేవలు మరింత విస్తరించనున్నాయి’ అని అన్నారు.

డ్యాష్‌ బోర్డుల ద్వారా రైతులకు ప్రయోజనం: మన్‌సుఖ్‌ మాండవియా
‘కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ నుంచి ఇవాళ రెండు మంచి పనులు మొదలవుతున్నాయి. దాదాపు 54 కోట్ల మంది రైతులు దేశంలో ఉండగా, వారి కోసం ప్రత్యేకంగా డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేశాం. దేశంలో ఎంత ఎరువుల ఉత్పత్తి జరిగింది? ఎంత స్టాక్‌ ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూటర్స్‌ వద్ద ఎంత సరుకు ఉందన్నది ఆ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) మరో మహత్తర చర్య. రైతులకు నేరుగా సబ్సిడీ చెల్లింపు. దీని వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ చర్యల వల్ల రైతులకు ఇచ్చే ప్రతి పైసా కచ్చితంగా వారికే అందుతుంది. దేశంలోని అన్ని గిడ్డంగులలో ఎరువులు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎక్కడా కొరత లేకుండా ఎరువులు అందుతాయి. బుక్‌ చేసుకున్న తర్వాత కేవలం 72 గంటల్లో ఎరువులు రైతులకు అందించడం నిజంగా అభినందనీయం’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో చివరగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఎలా పని చేస్తున్నాయన్న దానిపై ఏపీ ఉన్నతాధికారులు  వీడియో  ప్రదర్శించి చూపారు.

మరిన్ని వార్తలు