కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..

6 Jul, 2021 16:46 IST|Sakshi

అమరావతి: తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్‌ఎంబీ వద్ద  వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్‌ఎంబీ మీటింగ్‌ వదిలి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల  ప్రశ్నించారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా... న్యాయం మావైపే ఉందని ఆయన అన్నారు.  కేఆర్‌ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని ఆయన కోరారు. సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది?  అని అన్నారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్‌ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్షించారు.

తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్‌ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్‌ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు. ఇక ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు