అందుకే ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు: సజ్జల

18 Sep, 2020 16:01 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: దేవాలయాలలో అక్కడక్కడ జరిగే కొన్ని ఘటనలతో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుని కొన్ని శక్తులు ఏకమవుతున్నట్లు అనిపిస్తోంది అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ, ‘దేవాలయాల్లో కావాలనే ఇలాంటి సంఘటనలు సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుందని అనిపిస్తోంది లేకపోతే రోజు దేవాలయాలలో ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది.  అంతర్వేది ఘటన విషయంలో దేశంలో ఏ ప్రభుత్వం స్పందించని  విధంగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. అధికారులపై చర్యలు తీసుకుంది. విచారణ జరుపుతోంది.  కొత్త రాజధాని నిర్మాణానికి ఆదేశించింది.  అలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి  జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే పథకాలను చూసి ఓర్వలేక వాటిపై ప్రజల్లో జరిగే చర్చను అడ్డుకోవడానికి ప్రతి పక్షాలు ప్రయత్నిస్తున్నాయని అనిపిస్తోంది.  ప్రతిపక్షాల పాచికలు వేస్తున్నాయి.  గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ గోదావరిలో వేణుగోపాల స్వామి రథం తగలబడింది.  అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు.  ప్రజలే చందాలు వేసుకుని రథాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. రాజకీయ పార్టీలు  ప్రజల సమస్యలపై పోరాటాలు, చేసి ప్రజల కోసం నిలబడి ఓట్లు తెచ్చుకోవాలి  కానీ ఇలాంటి ఘటనల ద్వారా  అడ్డదారుల్లో ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రతిపక్షాలో కనిపిస్తుంది.  ప్రతిపక్షాలు చేసే దుష్ట రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పెద్దగా  పట్టించుకోవడం లేదు’ అని అన్నారు. 

చదవండి: ఆ బెంజ్‌ కారు నా కుమారుడిది కాదు: మంత్రి

మరిన్ని వార్తలు