‘కొత్త ఒరవడి సృష్టించి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తాం’

26 Feb, 2021 16:59 IST|Sakshi

సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ కడప: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 80 శాతానికి పైగా గెలుపొందారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మునిసిపల్, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఈ గెలుపులతో కొత్త ఒరవడి సృష్టించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. నాయకుల నుంచి కార్యకర్తల వరకు సమిష్టిగా అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కుప్పంలో కూడా ఊడుచుకుని పోయిన చంద్రబాబు.. మతిస్థిమితం తప్పి రాజకీయ అంశాలు వదిలేసి అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ నాయకులకూ అర్థం కాక అసంబద్ధ ప్రేలాపణలు చేస్తున్నారని సజ్జల వ్యంగస్త్రాలు సంధించారు. చంద్రబాబు మళ్ళీ మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో విడుదల చేశారని.. అమలు కానీ పనులు, హామీలను పొందుపర్చి మ్యానిఫెస్టో నాటకాలు అడుతున్నాడని మండిపడ్డారు. దీనిపై ఎస్‌ఈకీ ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించి చెత్తబుట్టలో వేసినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలు ప్రజల హృదయాల వరకు వెళ్లాయని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని అందించారని తెలిపారు. టీడీపీ దుకాణం మూసివేసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ అనుకూల మీడియాలో ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.

చదవండి: 

తిరుపతి, నాగార్జునసాగర్‌ షెడ్యూల్‌ విడుదల

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

మరిన్ని వార్తలు