చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు

21 Sep, 2020 16:58 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ధోరణి మారకపోతే ప్రజలే తరిమికొడతారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా అని ఆయన ప్రశ్నిస్తూ.. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. (చదవండి: రాజకీయ కుట్రతోనే దాడులు: వెల్లంపల్లి)

‘‘రాజధానిపై హైకోర్టులో విచారణకు వచ్చిన రోజు ఆ రెండు పత్రికలు, ఛానళ్లు హడావుడి చేస్తున్నాయి. అవాస్తవాలతో కథనాలు రాయడం న్యాయస్థానాలను ప్రభావితం చేయడం కాదా..? గతంలో వైఎస్‌ జగన్‌పైన అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా అంతమొందించడానికి కోర్టులో కేసులు వచ్చినప్పుడు అనేక కథనాలు రాశారు. కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. పత్రికల్లో వాస్తవాలు, అభిప్రాయాలు రాయటానికి స్థానం ఉంది. న్యాయస్థానాలను ప్రభావితం చేసే విధంగా వార్తలు రాయడం చట్ట వ్యతిరేకం. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావించింది. టీడీపీ నాయకులు, చంద్రబాబు బినామీలు జడ్జిలు వెళ్లే సమయంలో ప్రదర్శనలు చేస్తున్నారు. చట్టాలపై  అడ్డగోలుగా చాలెంజ్ చేయడం తప్పు. అడ్డగోలు కథనాలతో అడ్డుకోవటం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపించి జనాన్ని మోసం చేశాడు. పుండు మీద కారం చల్లినట్లుగా ఈనాడు కథనం రాసింది. చంద్రబాబు చెప్పిన నవ నగరాలను గుర్తు చేస్తే ప్రజలు వెంటపడి కొడతారని’’  సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. 

చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలోనే ఓట్లు వేయలేదని, అమరావతి ప్రాంతంలో రెండు నియోజకవర్గాలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాయన్నారు. రాజధానిలో పావలాకు వెయ్యి రూపాయలు లాభం రావాలని ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాజధానిని మార్చడం రాజ్యాంగ విరుద్దమనేలా ఈనాడులో రాశారు. రాజధానిని మేము మార్చడం లేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ది కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామని ఆయన తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని, తాము ఎవరినీ మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: శాఖ బాబుది.. సంతకం చినబాబుది)

‘‘రాజధానిలో రియల్ రైతులు 30 శాతం కూడా లేరు. మిగిలిన వారంతా పెట్టుబడి దారులే. చంద్రబాబు రాజధానిలో జనాన్ని మోసం చేసి వేల కోట్లు దోచుకుని.. అందరి నెత్తిన శఠగోపం పెట్టారు. అన్ని ప్రాంతాలను సమానంగా వృద్ది చెందాలనే సీఎం జగన్ ప్రయత్నం. సీఎం  చేస్తోన్న ప్రయత్నాన్ని గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు. మీరు చేసిన తప్పులు మేము చూపించాం. మాకు ప్రజలు అధికారమిచ్చారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. కనీసం రోడ్లు కూడా లేని గ్రామాల్లో అంత లోపలికి వెళ్లి కొందరే భూములను ఎందుకు కొన్నారు. నూజివీడులో రాజధానిలో వస్తుందని రాస్తే 500 కోట్ల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగారు. ప్రస్తుతం ఏడ్చేదంతా టీడీపీ దళారీలు, కమీషన్లు పోయినవారు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కోర్టులో కేసుంటే అక్కడ సత్తా చూపించాలని’’ ఆయన తెలిపారు.

‘‘వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుమల వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. విశ్వాసం లేకపోతే గౌరవిస్తున్నామని డిక్లరేషన్ ఇవ్వాలి. విశ్వాసం, వస్త్రధారణ, గౌరవం ఉండబట్టే సీఎం జగన్ తిరుమల వెళ్తున్నారు. పూర్తి హిందువుగా సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. తిరుమల శ్రీవారిపై నమ్మకం, విశ్వాసం సీఎం జగన్‌కు ఉన్నాయి. మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకుని చేసే శక్తులే డిక్లరేషన్‌పై వివాదం చేస్తున్నారు. గంగ నుంచి కృష్ణా నది వరకు పుణ్య స్థానాలు చేశారు. పలు నదుల్లో పుణ్య స్థానాల్లో చేసిన వ్యక్తి సీఎం జగన్. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే విధానం మాది. నిజమైన సెక్యులర్ భావాన్ని పెంపొందించే పార్టీ వైఎస్సార్‌సీపీ అని’’ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు