కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదు: సజ్జల

10 Jul, 2021 12:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలు, రెండు రాష్ట్రాల వినియోగం సహా.. ఏపీ హక్కులు అంశాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అసలు అక్రమంగా పాలమూరు రంగారెడ్డి కట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. 

గతంలో కేసీఆర్ కూడా రాయలసీమకు నీళ్ళందించాల్సిన అవసరం ఉంది, సహకరిస్తాం అన్నారని సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అడ్డు తగులుతున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ లిఫ్ట్ ద్వారా కొత్తగా ఆయకట్టుకి నీళ్లివ్వడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టిందని, ఆ రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు చేసినా చంద్రబాబు మేల్కొనలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కుల కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. 

తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళతామని స్పష్టం చేశారు. కృష్ణా నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా జరిగాయన్న సజ్జల.. ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు చేశారని ప్రస్తావించారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి వలన తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ అంశాలపై అన్ని వేదికల ద్వారా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు