‘చంద్రబాబు బరితెగించి ప్రచారం చేస్తున్నారు’

14 Feb, 2021 18:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌కు ఫేక్‌గా టీడీపీ మరో వెబ్‌సైట్‌ను సృష్టించిందని, చంద్రబాబునాయుడు ఫేక్‌ వెబ్‌సైట్‌తో ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఫేక్ వెబ్‌సైట్‌పై సీఐడీకి పార్టీ తరఫున ఫిర్యాదు చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రజల తీర్పును చాలా నీచంగా వక్రీకరిస్తున్నారని, అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ పాలనలో అందరకీ సంక్షేమ ఫలాలు అందాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ. రెండో విడత ఎన్నికల్లో కూడా 80 శాతం విజయం సాధించాం.  2649 మంది వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీ 538, బీజేపీ 5, జనసేన 35, ఇతరులు 98 మంది గెలిచారు. పార్టీ వెబ్‌సైట్‌లో పార్టీ మద్దతుదారుల ఫోటోలు కూడా ఉంచుతున్నాం. రెండో దశ ఎన్నికల ఫలితాలపై కూడా ..చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మీడియా ద్వారా చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ( ఓటమి జీర్ణించుకోలేక.. రెచ్చిపోతున్న టీడీపీ నేతలు )

ఈ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. టీడీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోకూడదని.. టీడీపీలోని నేతలను భ్రమలో పెట్టాలనే చంద్రబాబు ఉద్దేశం. అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తూ చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్‌ఈసీనే ..ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఖూనీ అయిందో చంద్రబాబు చెప్పాలి. ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకున్న నేత కూడా చంద్రబాబు ఒక్కరే. మరో 30 ఏళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన కావాలని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే రెండు దశల ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులదే గెలుపు.  రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌ సీపీదే విజయం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు