ఉద్యోగుల బాగు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: సజ్జల

4 Jun, 2022 12:25 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. సజ్జల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఎన్జీవో అపా‍ర్ట్‌మెంట్ నిర్మించుకోవడం సంతోషకరం. తక్కువ ధరకే ఉద్యోగులకు ఇలాంటి గృహాలను ఇవ్వడం శుభ పరిణామం. 

ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను ఆంధ‍్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఇందుకు ఉద్యోగులను అభినందిచక తప్పదు. పాలకుడు మంచివారైతే అయితే అందులో భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చిన ఉద్యోగులకు ధన్యవాదాలు.

రాష్ట్రంలో సమస్యలు ఉద్యోగులకు తెలియనివి కావు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు చూశాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు భయపడకుండా సేవలను అందించారు. ఆదాయం తగ్గి భారం పెరిగింది. ఉద్యోగులు ఆశించినంతగా ప్రభుత్వం సహాయం చేయలేకపోయింది. దీన్ని కూడా ఉద్యోగులు స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌గా ఉన్న ఆర్టీసీ విలీనాన్ని చేసిన ఘనత మన ప్రభుత్వానిది.

ఉద్యోగికి ఏ సమస్య ఉన్నా చట్టానికి లోబడి పరిష్కారం చేసే దిశగా ఎల్లపుడూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ  సంఘాలను రాజకీయాలకు వాడుకోవాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. అది ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా తెలుసు. ఉద్యోగులకు అన్నీ చేయాలని ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోయాం. సీఎం జగన్‌ ఆలోచనలు సాధ్యం కావాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరి. ఉద్యోగుల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుంది’’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు

మరిన్ని వార్తలు