విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి నోటీసులిస్తాం: ఏసీపీ

16 Aug, 2020 13:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. ఏసీపీ సూర్యచంద్రరావు  ఆదివారం సాక్షి టీవీ  మాట్లాడారు. ' రమేశ్‌ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు డాక్టరు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం. రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాలి. ఆరోగ్యం బాగోలేదు రెండు వారాలు క్వారంటెన్లో ఉండాలని మెయిల్ చేశారు.ఆయన సోదరుడు ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లోనే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇంట్లోనే విచారణకు రమ్మన్నారు. నిజంగా ఆరోగ్యం బాగాలేదా లేక నోటీసులు తీసుకుని విచారణకు ఆటంకం కలిగించడానికి ఈవిధంగా చేస్తున్నారా అన్నది పరిశీలిస్తున్నాం. వృద్దాప్యంలో ఉన్నవారు విచారణకు రాలేకపోతే ఇంటికికే వెళ్లి విచారిస్తాం..మిగిలిన వారు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుంది. రమేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. (అడుగడుగునా నిర్లక్ష్యం)

'సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు. పరారీలో ఉండి దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదు. నేడు 91 సీఆర్‌పీసీ కింద ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని నోటీసు ఇస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే  ఎంవోయూ చేసుకున్నారో మాకు తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చూపించాలి.ఆస్టర్ గ్రూప్ తో అగ్రిమెంట్, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్, వారి బాధ్యత తెలియాలి. హోటల్ వేరు, కోవిడ్ కేర్ సెంటర్ వేరు. ఇందులో పేషన్ట్లు ఉంటారు కాబట్టి.. ప్రతి అంతస్తుకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు మాకు చూపించలేదు. దీనిపై ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది. క్వారంటెన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు.. ఎవరి అభప్రాయాలు వారికి ఉంటాయి. విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా నోటీసులు ఇస్తాం.' అంటూ వెల్లడించారు.

రామ్‌ అసత్య ఆరోపణలు మానుకోవాలి
అగ్నిప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సినీ హీరో రామ్‌ ట్వీట్లను పోలీసులు తప్పుపడుతున్నారు .క్వారెంటైన్ సెంటర్‌కి కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా తెలుసుకోకుండా పోస్టింగులు పెట్టడం సరికాదంటున్నారు. బాబాయ్ డాక్టర్‌ రమేష్ని కాపాడుకొనేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగిలితే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తున్నారు. పదిమంది ప్రాణాలు పోతే  రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ బాబు పారిపోయి ఆడియో టేపులు విడుదల చేయటం బాధ్యతారాహిత్యమంటున్నారు. ట్వీట్లు ,ఆడియో టేపులు పంపటం మాని ఆధారాలు ఉంటే విచారణకు హాజరు కావాలని ఏసీపీ సూర్యచంద్రరావు సూచించారు.

మరిన్ని వార్తలు