ఆర్టీసీలో పీఆర్‌సీకి రైట్‌ రైట్‌ 

24 Sep, 2022 08:16 IST|Sakshi

వచ్చే నెల నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు నూతన పీఆర్‌సీ ప్రకారం వేతనాలు

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అలవెన్స్‌లు

ఇప్పటికే  ఆర్టీసీనిప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

మాట తప్పని నేతగా మరోసారి నిరూపించిన ముఖ్యమంత్రి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,037 ఉద్యోగుల ఇళ్లలో సంబరాలు

కర్నూలు(రాజ్‌విహార్‌): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2020 జనవరి 1 నుంచి రోడ్డు రవాణా సంస్థ కార్మికులను ప్రజా రవాణ శాఖలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకొచ్చారు. తాజాగా పీఆర్‌సీ(పేరివిజన్‌ స్కేల్‌) జీతాలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల నాటి కల నెరవేరిందని, సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారని, తాము ఆయనకు రుణపడి ఉంటామని ఉద్యోగులు, సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 4,037 మంది ఉద్యోగుల ఇళ్లలో ఆనందం నెలకొంది. 

ఆర్టీసీ చరిత్ర ఇదీ.. 
1932లో 27 బస్సులతో ఈ సంస్థ ప్రారంభమైంది. ముందుగా నిజాం రోడ్‌ ట్రాన్స్‌పోర్టు పేరుతో ఆవిర్భవించిన సంస్థ 1951 నవంబరు 1న హైదరాబాద్‌ రాష్ట్ర రవాణా సంస్థగా, 1958లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా ఏర్పడింది. ప్రపంచంలో ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో నడపబడుతున్న అతిపెద్ద సంస్థగా 1999లో గిన్నీస్‌ బుక్‌లో స్థానం పొందింది. రాష్ట్రం విడిపోయాక 2015 మే 14వ తేదీన ఆర్టీసీ తెలంగాణలో సేవలను నిలిపివేయడంతో టీఎస్‌ ఆర్టీసీ ఏర్పడింది. 

హామీలు.. అమలు 
ఆర్టీసీ కష్టాలను తొలగించాలని కార్మిక సంఘాలు చేసిన విన్నపాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ విలీనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వంద రోజుల్లోపు నివేదికలు తెప్పించుకొని మంత్రివర్గంలో, అసెంబ్లీలో ఆమోదం కల్పించి, 2020 జనవరి 1వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. దీంతో కార్మికులతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటు అన్ని బెనిఫిట్స్, అలవెన్స్‌కు అర్హత సాధించారు. ఉద్యోగుల భద్రత, సంక్షేమం, పదవీ విరమణ పొందాక పెన్షన్‌ అందుకునేందుకు అర్హత కల్పించారు. ఆక్టోబర్‌ 1 నుంచి ట్రెజరీ ద్వారా కొత్త పీఆర్‌సీ వేతనాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించి మరోసారి మాట నిలుపుకున్నారు. 

4,037 మంది ఉద్యోగులకు లబ్ధి 
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 12 డిపోల్లో 4,037 మంది ఆర్టీసీ ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా లబి్ధపొందనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో  డ్రైవర్లు 1,677 మంది, కండక్టర్లు 1,286 మంది,  అధికారులు, సూపర్‌వైజర్లు 258 మంది, అకౌంట్స్, పర్సనల్‌ అధికారులు 103 మంది ఉన్నారు. అలాగే నిర్వహణ విభాగంలో 607 మంది, స్టోర్స్‌లో ముగ్గురు, సెక్యూరిటీ గార్డులుగా 72 మంది, వైద్య విభాగంలో ఏడుగురు,  సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆరుగురు పనిచేస్తున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నంఉచి కొత్త పీఆర్‌సీ వేతనాలు ఇస్తుండడంతో వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా కొత్త పీఆర్‌సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల ఇళ్లలో దసరాకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. 

 చాలా గొప్ప నిర్ణయం 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా పీఆర్‌సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల్లో సంతోషం నెలకొంది. ఆయన నిర్ణయం గొప్పగా ఉంది. ఇచి్చన హామీలను అమలు చేస్తున్న సీఎంకు ఉద్యోగుల తరఫున అభినందనలు. 
– మద్దిలేటి, ఎన్‌ఎంయూ రీజినల్‌ కార్యదర్శి

నిజమైన పండగ  
ఆర్టీసీ బాగు కోసం వైఎస్సార్‌ ఎంతో కృషి చేశారు. అదే తరహాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రజా రవాణ శాఖలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు   పీఆర్‌సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు నిజమైన పండగ. మాట నిలబెట్టుకున్న సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు రుణపడి ఉంటారు. 
– నాగన్న, వైఎస్‌ఆర్‌ ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అభినందనీయం 
ప్రజా రవాణా  శాఖ ఉద్యోగులకు పీఆర్‌సీ వేతనాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచి్చన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు పీఆర్‌సీ వేతనాలు ఇవ్వడం చాలా సంతోషం. 
– ఏవీ రెడ్డి, ఈయూ రీజినల్‌ కార్యదర్శి 

ప్రభుత్వానికి కృతజ్ఞతలు  
ఆర్టీసీని ప్రజా రవాణా శాఖలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా మార్చారు. దీంతో మాకు ఉద్యోగ భద్రత కలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని అలవెన్స్‌లు అందుకుంటున్నాం. ఇప్పుడు పీఆర్‌సీ వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం నిర్ణయం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. 
– జె. రబ్బాని, కర్నూలు–2డిపో డ్రైవర్‌

మరిన్ని వార్తలు