YSRCP Bus Yatra: సామాజిక న్యాయభేరి.. రెండో రోజు బస్సు యాత్ర

27 May, 2022 10:24 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాత గాజువాక వైఎస్సార్‌ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు గాజువాకలో ఏర్పాటు చేసిన సభా వేదికపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘ఆంధ‍్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరు’’ అని అన్నారు. 

అంతకుముందు మంత్రి వనిత మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టమైంది. అరెస్ట్ అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారు. ఆధారాలు, ఫొటోలు, వీడియోలతో ఆధారంగా వారిని అరెస్ట్‌ చేశాము. చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. నేను వీళ్ళ పాత్ర ఉందని ముందే చెప్పాను. బస్సు యాత్రకి స్పందన లేదనడం చంద్రబాబు అవివేకం. ప్రతీ చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తున్నారు’’ అని తెలిపారు.

అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోంది. మళ్లీ సీఎం జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద‍్రబాబు. మహానాడు కాదు.. అది వల్లకాడు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చం‍ద్రబాబు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి’’ అని అన్నారు.

‘సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని ప్రతి పక్ష పార్టీ లు అల్లర్లు సృష్టిస్తున్నారు. దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం సమర్థిస్తున్నారా లేదా ప్రతి పక్షాలు సమాధానం ఇవ్వాలి.  జగనన్న పాలనలో నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది..రాజకీయ దళారీలు లేరు.  మూడేళ్లుగా మేలు జరుగుతుంటే జన్మ భూమి కమిటీలు భరించలేక పోతున్నాయి. మాట ప్రకారం పీడిత వర్గాలకు సమన్యాయం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. గడప గడపకి వెళ్తుంటే ప్రజలు జగన్ వెంట ఉంటామని అంటున్నారు’ అని తమ్మినేని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: హోరెత్తిన సామాజిక భేరి

మరిన్ని వార్తలు