‘సర్వేపల్లి’ మనుమడు కేశవ్‌ దేశిరాజు కన్నుమూత

6 Sep, 2021 03:40 IST|Sakshi
కేశవ్‌ దేశిరాజు (ఫైల్‌)

సాక్షి,చెన్నై/బాపట్ల: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మనుమడు (కుమార్తె కుమారుడు), విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేశవ్‌ దేశిరాజు (66) చెన్నైలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తన తాత రాధాకృష్ణన్‌ జయంతి రోజునే ఆయన తనువు చాలించడం విచారకరం. కేశవ్‌ పూర్వీకులు బాపట్లలోని దేశిరాజు వారి వీధిలో నివసించారు. ఇప్పటికీ చాలామంది దేశిరాజు కుటుంబాల వారు అక్కడ ఉన్నారు.

1978 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కేశవ్‌.. కేంద్ర ఆరోగ్య శాఖ, వినియోగదారుల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. తన తాత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తిని అణువణువునా పుణికిపుచ్చుకున్న కేశవ్‌ దేశిరాజు అనేక పుస్తకాలు రాశారు. కేశవ్‌ దేశిరాజు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేష్‌ సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తలు