దారుణం: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్‌మెన్‌

30 Mar, 2021 14:42 IST|Sakshi

గాజువాక: సెలవు రోజున విద్యార్ధి గోడ దూకి పాఠశాలలోకి వచ్చాడనే కోపంతో విద్యార్థిని ఓ వాచ్‌మెన్‌ చితక్కొట్టాడు. వీపు, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే వాచ్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాకలో జరిగింది. అయితే వాచ్‌మెన్‌ దాడి చేసిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. రాత్రి చొక్కా తీసి నిద్రిస్తున్న సమయంలో ఒంటిప్తె ఉన్న దెబ్బలు చూసి తల్లి అడగడంతో ఈ విషయం బయటపడింది.

గాజువాక బీసీ రోడ్డులో ఉన్న మార్వెల్ పాఠశాలలో చ్తెతన్య ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొంతమంది విద్యార్థులతో కలసి ఆడుకునేందుకు పాఠశాలకు వచ్చాడు. అయితే వాచ్‌మెన్ అనుమతి తీసుకుని లోనికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో వేరే అబ్బాయి వచ్చాడు. పాఠశాలలలో ఉన్న బస్సు ఎక్కి హారన్ కొట్టడంతో వాచ్‌మెన్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్రతో చితకబాదాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంటికెళ్లినా విద్యార్థి వాచ్‌మెన్‌ కొట్టిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే రాత్రి నిద్రిస్తుండగా తల్లి సత్యగౌరి చూసి ప్రశ్నించగా ఈ విషయం బయటకు వచ్చింది.

తెల్లారి వెంటనే పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. తప్పు చేస్తే ఇంత దారుణంగా వాచ్‌మెన్ కొడతారా అని అడిగారు. విద్యార్ధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి వాచ్‌మెన్‌ను పిలిపించారు. అయితే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే వాచ్‌మెన్ దారుణంగా కొట్టాడని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్‌లో ఆత్మహత్య
​​​​​​​

చదవండి: ముగ్గురి గ్యాంగ్‌ రూ.3 కోట్ల మోసం

మరిన్ని వార్తలు