నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

1 Sep, 2020 12:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలపై నిఘా పెడుతున్నామని, డ్రగ్ లైసెన్స్ లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజలాల్‌ తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, జీడిమెట్ల ప్రాంతాలలో కొందరు కల్తీ శానిటైజర్ యూనిట్లు నడుపుతున్నట్టు గుర్తించామని, జీడిమెట్ల నుంచి నకిలీ శానిటైజర్లు సప్లై జరుగుతోందని తెలిపారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేటితో ఎస్ఈబీ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల అక్రమ మద్యం కేసులు నమోదు చేశాం. 46,500 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించాం. ఇతర రాష్ట్రాల మద్యంతో పాటు నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నాం. 2 లక్షల యాభై వేల లీటర్ల నాటుసారాను ఐడీ పార్టీ స్వాధీనం చేసుకుంది. ( ఎస్‌ఈబీ సత్తా చాటుతోంది )

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న 2,75,000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశాం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా జరుగుతున్నట్టు గుర్తించాం. తమిళనాడు, ఒరిస్సా నుంచి తక్కువ స్థాయిలో అక్రమ స్మగ్లింగ్ జరుగుతోంది. ఎక్సైజ్ యాక్ట్ 46 ప్రకారం అక్రమ మద్యాన్ని ధ్వంసం చేస్తున్నాం. లాక్ డౌన్ తర్వాత అక్రమ మద్యం తరలింపు ఎక్కువైoది. పట్టుపడ్డ వారికి 8 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మద్యం రవాణాలో 139 మంది ప్రభుత్వ సిబ్బందిని రిమాండ్‌కి తరలించాం. పట్టుబడ్డ వారిలో 6 గురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, 48 మంది లోకల్ పోలీసులు, సెంట్రల్ పారామిలటరీ సిబ్బంది ఉన్నారు. కల్తీ శానిటైజర్లపై ఎస్ఈబీ, డ్రగ్ కంట్రోల్, పోలీసు శాఖ సంయుక్త దాడులు చేస్తున్నాయ’’న్నారు.

పొట్ట చుట్టూ మద్యం సీసాలు టేపు చేసుకుని..
కృష్ణ : అక్రమంగా మద్యాన్ని చేరవేసేందుకు ఓ ఇద్దరు వ్యక్తులు వేసుకున్న ప్లాన్‌ బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. మంగళవారం చాట్రాయి మండలం పోలవరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టేపుతో పొట్ట చుట్టు సీల్‌ చేసుకున్న దాదాపు 105 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు