ఎవరైనా.. ఎంతటి వారైనా.. 

5 Oct, 2020 05:32 IST|Sakshi

మద్యం అక్రమ రవాణాపై ఎస్‌ఈబీ కఠిన చర్యలు 

233 మంది ప్రభుత్వ ఉద్యోగులపైనా కేసులు 

పట్టుబడిన వారిలో 65 మంది పోలీస్, ఎక్సైజ్‌ ఉద్యోగులే 

ఇతర శాఖల ఉద్యోగులు 168 మంది 

నాలుగు నెలల్లో 40 వేలు దాటిన అక్రమ మద్యం కేసులు

సాక్షి, అమరావతి: దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పాటైన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రభుత్వ ఆదేశాల మేరకు చురుగ్గా వ్యవహరిస్తోంది. మద్యం అక్రమ రవాణా చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు. ఫలితంగా అక్రమ మద్యం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పట్టుబడుతున్నారు. వీరిలో పోలీస్, ఎక్సైజ్‌ శాఖలతోపాటు ఇతర విభాగాల ఉద్యోగులు కూడా ఉన్నారు. 

4 నెలల్లో 233 మంది ఉద్యోగుల పట్టివేత 
► స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటైన నాలుగు నెలల వ్యవధిలో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 50 వేల మందిని ఎస్‌ఈబీ అరెస్ట్‌ చేసింది. 
► మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 233 మంది ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసే సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగులూ ఉండటం గమనార్హం.  
► కేసుల్లో పట్టుబడిన వారిలో ఎస్‌ఈబీ ఉద్యోగులు 65 మంది ఉండగా.. మిగిలిన 168 మంది ఇతర శాఖల ఉద్యోగులు. 
► కృష్ణా జిల్లాలో 27 మంది, కర్నూలులో 48 మంది, పశ్చిమ గోదావరిలో 26 మంది ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డారు. 
► ఎస్‌ఈబీ ఉద్యోగుల్లో 25 మందిపై అభియోగాలు నమోదు కాగా.. 9 మందిని సస్పెండ్‌ చేశారు. మరో 10 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆరుగురిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. 

ఎంతటి వారినైనా ఉపేక్షించం
అక్రమ మద్యం కేసుల్లో ఎంతటి వారున్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్‌ఈబీ ఆవిర్భవించిన నాలుగు నెలల్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పదే పదే పట్టుబడితే పీడీ కేసులు నమోదు చేస్తాం. 
– వినీత్‌ బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ కమిషనర్‌   

మరిన్ని వార్తలు