సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్కి అవకాశం కల్పించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతి కార్పోరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్ల రీనామినేషన్కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నారు.