వారి కదలికలను పరిశీలించాలి
వారి ఫోన్లు స్వాదీనం చేసుకోవాలి
కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనకుండా వారిని పూర్తిగా దూరం పెట్టాలని కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నిబంధనలు వలంటీర్లకూ వర్తిస్తాయన్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా వలంటీర్లు వ్యవహరిస్తే నేరపూరిత చర్యగా పరిగణిస్తామన్నారు. ఓటర్ల స్లిప్ల పంపిణీ బాధ్యతలను కూడా వలంటీర్లకు అప్పగించవద్దని ఆదేశించారు. వలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం లేకుండా వలంటీర్ల ఫోన్లను స్వాదీనం చేసుకోవాలన్నారు. కాగా, వారి సాధారణ విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులుండవన్నారు.