సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక ఎన్నికల చిహ్నం పొందేందుకు అర్హత ఉన్న ఇతర రిజిస్టర్డ్ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధత కోసం శని, ఆది, సోమవారాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ప్రాంతీయ సదస్సులను నిర్వహించనున్నట్టు తెలిపారు.