ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

22 Jul, 2021 12:41 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు ఎస్‌ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఈనెల 25న ఉ.8 నుంచి కౌంటింగ్‌ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించుకోవచ్చన్న డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలతో ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్‌ నిబంధనలతో కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

కాగా, మార్చి 10న ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్‌ జాగ్రత్తల మధ్య జరిగిన ఎలక్షన్‌లో  56.86% పోలింగ్ నమోదైంది. అయితే, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు