సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేసి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ఫ్యూ సడలింపు సమయంలో(ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు) సెక్షన్ 144ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 10 వరకు కర్ఫ్యూ యథాతథంగా అమలు జరుగుతుందని, కర్ఫ్యూ సడలింపు వేళల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షాపులు, బజార్లు, రోడ్లపైన ప్రజలు గుమికూడవద్దని స్పష్టం చేశారు. కాగా, చేపల మార్కెట్లు, చికెన్ మార్కెట్లతో పాటు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం షాపులకు వెళ్లే వారంతా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.