జూదాలపై ఉక్కుపాదం

17 Jan, 2023 16:34 IST|Sakshi

జూద సామగ్రి స్వాధీనం

తొలగించిన షామియానాలు

1,608 మందిపై కేసుల నమోదు

రూ.22.70 లక్షల స్వాధీనం 

సాక్షి, భీమవరం: సంక్రాంతి పండగ రోజుల్లో జూదాలను అరికట్టడంతో పోలీసులు విజయం సాధించారు. భోగి పండగ రోజున అక్కడక్కడా కోడి పందేలతోపాటు జూదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ఉక్కుపాదం మోపారు. ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా్లవ్యాప్తంగా గుండాట, పేకాట, కోడిపందేలు వంటి జూదాలపై 650 చోట్ల దాడులు చేసి 1,608 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి సుమారు రూ.22.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి నుంచి జూదాలు నిర్వహించే ప్రాంతాల్లో దాడులు చేసి  షామి యా లను ధ్వంసం చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

సంక్రాంతి పండగ మూడు రోజులు సంప్రదాయం పేరుతో కోడి పందేల శిబిరాల వద్ద గుండాట, పేకాట విచ్చలవిడిగా నిర్వహించడం సర్వసాధారణం. పండగలో జూదాల్లో పెద్ద మొత్తంలో సొ మ్ములు పొగొట్టుకుని పేద, మధ్యతరగతి వర్గాలు రోడ్డున పడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా జూదాలకు అవకాశం లేదని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ముందుగానే హెచ్చరించారు. దీనిలో భాగంగా దాదాపు నెల రోజుల ముందు నుంచే గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు సమావేశాలు నిర్వహించి జూదాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతోపాటు నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జూదాలు నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరికగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. 

పందేల మాటున..  సంక్రాంతికి సంప్రదాయంగా కోడిపందేలు నిర్వహించడం పరిపాటి. అయితే కొ న్నిచోట్ల పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు నిర్వహిస్తుంటారు. బరుల వద్ద భారీ షామియానాలు ఏర్పాటుచేసి జూదగాళ్లకు కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పించి పెద్ద మొత్తంలో జూదాలు నిర్వహిస్తారు. ఇందుకు జూదాలు నిర్వహించే వారు పెద్ద మొత్తంలో బరి నిర్వాహకులకు సొమ్ములు ఇస్తుంటారు. ఈ ఏడాది కొన్నిచోట్ల వేలం పాటలు ని ర్వహించి మరీ జూదాలకు స్థలాలను దక్కించుకున్నారు. వీరవాసరం మండలంలోని కోడిపందేల శిబి రం వద్ద జూదాల నిర్వహణకు రూ.48 లక్షలు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  

శనివారం రాత్రి నుంచే కట్టడి 
భోగి పండగ రోజున కోడి పందేలతోపాటు విచ్చిల విడిగా జూదాలు ప్రారంభించడమేగాక శిబిరాల వద్ద భయం లేదని పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చామంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకున్నారు. జూదాల నిర్వహణ, ముడుపుల ప్రచారం జిల్లా ఎస్పీల దృష్టికి వెళ్లడంతో పోలీసు శాఖ దాడులు ప్రారంభించింది. శిబిరాల వద్ద  షామియాలను తొలగించి జూదాల నిర్వహణకు ఉపయోగించే గుండాట బోర్డులు, బల్లలు వంటి సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదాల నిర్వాహకులపై కేసులు కూడా నమోదుచేశారు. దీంతో ఆది, సోమవారాలు జూదాల నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. 

అసాంఘిక కార్యకలాపాలను సహించం  
పండగల పేరుతో అ సాంఘిక కార్యకలా పాలను చేపడితే సహించం. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో గుండాట, పేకాట, కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు చేసి 142 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.4,77,190 నగదు స్వాధీనం చేసుకు న్నాం.  ప్రజలు కూడా సహకరించి ఎక్కడైనా జూదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇస్తే మరింత కట్టుదిట్టంగా అరికడతాం. 
– యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం   

ఏలూరు జిల్లాలో.. 
ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో పేకాట, గుండాల, కోడిపందేలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. పేకాట శిబిరాలపై 142 చోట్ల దాడులు చేసి 408 మందిపై కేసులు నమోదు చేసి రూ.12,30,405 నగదు స్వాధీ నం చేసుకున్నారు. అలాగే గుండాటలపై 179 చోట్ల దాడులు చేసి 388 మందిపై కేసులు నమోదు చేసి రూ.2,30,480 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలపై 285 చోట్ల దాడులు చేసి 670 మందిపై కేసులు నమోదు చేసి రూ.3,32,370 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 323 కోడిపుంజులు, 353 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు