GIS 2023: 9 రంగాలపై సెమినార్లు 

4 Mar, 2023 04:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పలు రంగాలలో మొదటి రోజు సెమినార్లు జరిగాయి. వీటిలో ప్రధానంగా రెన్యువబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ (పునరుత్పాదక శక్తి), ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, ఐటీ, ఆటోమేటివ్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్‌ ఇన్నోవేషన్స్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో సెమినార్లు నిర్వహించారు.

పారిశ్రామికవేత్తలకు మంత్రులు, అధికారులు ప్రభుత్వ విధానాలను వివరించారు . ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ విస్తారంగా ఉన్న భూమి, వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటి లభ్యత, నిరంతర విద్యుత్‌ సరఫరాను వివరించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని తెలిపారు. 

ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు 
‘ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు’ రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హాజరయ్యారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఆమె  వివరించారు. ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలోని 2,200 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా 3,200 రోగాలకు వైద్యం అందిస్తున్నాం.

పార్లమెంట్‌ నియోజకవర్గానికో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. వైద్య విభాగంలో పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది’ అని మంత్రి వివరించారు.  దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన మణిపాల్‌ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో దిలీప్‌ జోష్, ఉస్మానియా వైద్య నిపుణులు గురునాథ్‌రెడ్డి, ఎయిమ్స్‌ హెచ్‌వోడీ ముకేష్‌ త్రిపాఠి తదితరులు క్వాలిటీ హెల్త్‌ సిస్టమ్, ప్రైవేట్‌ సెక్టార్‌ హెల్త్‌ కేర్, వైద్య రంగం ద్వారా వచ్చే రెవెన్యూ, ఉద్యోగావకాశాలు, ఇమేజింగ్‌ హెల్త్‌ కార్డ్‌ డెలివరీ, కమ్యునికబుల్, నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజస్‌ అనే అంశాలపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ‘ఫ్యామిలీ ఫిజిషియన్‌’ విధానాన్ని, ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగువారికి అందిస్తున్న ఉచిత వైద్యాన్ని ప్రశంసించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. 

పునరుత్పాదక ఇంధన శక్తి 
రెన్యువబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ (పునరుత్పాదక ఇంధన శక్తి) రంగంలో పెట్టుబడిదారులతో రాష్ట్ర ఇంధన శక్తి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన శక్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు.

ఈ రంగంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, ఆర్‌పీవో ప్రయోజనాలను వివరించారు. ‘2030 నాటికి ఏపీలో 500 కేటీపీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యం. 10 నుంచి 15 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ఎనర్జీ అవకాశాలు ఏపీలో ఉన్నాయి. 38 జీడబ్ల్యూ సోలార్, 44 జీడబ్ల్యూ విండ్, 34 జీడబ్ల్యూ హైడ్రో ప్రాజెక్టులకు అవకాశాలు­న్నాయి.  974 కిలోమీటర్ల తీర ప్రాంతం, 6 పోర్టులు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే 45% ఎకనామికల్‌ వాటర్‌ సదుపాయం ఏపీలో ఉన్నాయి.  నిపుణులైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని పెద్దిరెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు