ఏపీకి సీరమ్‌ వ్యాక్సిన్‌.. పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు

12 Jan, 2021 08:54 IST|Sakshi

అమరావతి: కరోనా వైరస్‌కు విరుగుడు వచ్చేస్తోంది. అత్యవసర అనుమతి పొందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. పూణె నుంచి కోవిషీల్డ్‌ టీకాలు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. మొత్తం 4.7 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే 19 వాహనాలలో రేపు (జనవరి 13) అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్‌ డెలవివరీ వాహనాలలో ఏర్పాట్లు చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద వాక్‌ ఇన్‌ కూలర్స్‌.. ఒకటి 40 క్యూబిక్‌ మీటర్లు.. రెండోది 20 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం ఉన్న వాటిని సిద్ధం చేశారు.

వ్యాక్సిన్‌ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతరం విద్యుత్‌ సరఫరా అందిస్తున్నారు. రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులకు ప్రవేశం నిషేధం. 8 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. టీకాల పంపిణీలో భాగంగా తొలి దశలో 3.87లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి కరోనా వారియర్స్‌కు టీకాల పంపిణీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు