Hindupuram Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’ 

26 Aug, 2022 15:19 IST|Sakshi

సాక్షి, హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా): తన సోదరి చిత్రాలను మార్ఫింగ్‌ ద్వారా అశ్లీల చిత్రాలు మార్చి బెదిరించి లాడ్జికి వచ్చేలా చేసి ఆమెను చంపేశాడని పట్టణంలోని జీఆర్‌ లాడ్జిలో బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్‌ అక్షిత సోదరుడు శషాంక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వరంగల్‌ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్లి అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలోని ఓ మెడికల్‌ కళాశాలలో పీజీ చదువుతోంది. ఈమెకు 6 నెలల క్రితం మెదక్‌ జిల్లా పటాన్‌ చెరువుకు చెందిన మహేష్‌ వర్మ బస్సులో పరిచయమయ్యాడు. అక్షిత ఇన్‌స్ట్రాగామ్‌ ఫాలో అయ్యి ఆమె ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. వాటిని అశ్లీలంగా మార్చిన అనంతరం అక్షితకు చూపి బెదిరిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హిందూపురంలోని జీఆర్‌ లాడ్జికి వచ్చేలా చేశాడు. లాడ్జిలోని ఓ రూంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితుడు మహేష్‌ వర్మ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

చదవండి: (లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య)

మరిన్ని వార్తలు