సీఎం జగన్‌ను కలిసిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌

29 Dec, 2021 14:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కిడాంబి శ్రీకాంత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. కిడాంబి శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు. 


ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో.. 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు

మరిన్ని వార్తలు