ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు

28 Jul, 2020 15:45 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: మాస్క్‌ వివాదంలో ప్రాణాలు విడిచిన చీరాల యువకుడు కిరణ్‌ కేసులో ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటుపడింది. కిరణ్‌పై పోలీసులు దాడి చేయడం వల్లే మృతి చెందాడని ఆరోపణల నేపథ్యంలో చీరాల ఎస్సై విజయ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ గంగాధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. చీరాలలోని థామస్‌పేటకు చెందిన ఎరిచర్ల మోహన్‌రావు, హెప్సీబాల కుమారుడు కిరణ్‌కుమార్‌ (26), స్నేహితుడు షైనీ అబ్రహాంతో కలిసి ఈనెల 19వ తేదీన తన పల్సర్‌ వాహనంపై వెళుతుండగా కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఔట్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా, వారు వాగ్వావాదానికి దిగారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వారిని పోలీస్‌ జీపులో తరలిస్తుండగా, మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు దాడి చేశారని పేర్కొంటూ కిరణ్, షైనీలు ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన కిరణ్‌ను అదే రోజు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే.  (మాస్కు వివాదం.. యువకుడి బలి)

(చీరాల ఘటనపై సీఎం జగన్‌ సీరియస్‌‌)

మరిన్ని వార్తలు