సాక్షి, విశాఖపట్నం: మత్స్య శాఖ అభివృద్ధిపై మంత్రి డా.సిదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3వందల నుంచి 350 మిలియన్ టన్నుల ఎగుమతులే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం, రామయపట్నం పోర్టుల అభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అనే పేరు వినబడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు భావనపాడు పోర్టుని పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే స్పెషల్ పరపస్ వెహికల్ను ఏర్పాటు చేసి, ల్యాండ్ లార్డ్ మోడల్లో నిర్మాణం చేపడతాం అని తెలిపారు. మొదటి దశ 5 వందల ఎకరాల్లో బల్క్ కార్గో పోర్ట్ నిర్మాణం జరుగుతందని, మలి దశలో 2217 ఎకరాల్లో భావనపాడు పోర్ట్ నిర్మాణం జరగుతుందని పేర్కొన్నారు.
కాగా భావనపాడు, దేవునల్తాడ గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి క్రింద నష్టపరిహారం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. మంచినీళ్ల పేట, బుడగట్ల పాలెం వద్ద జెట్టీ నిర్మాణం చేపడతామని, మత్స్యకారుల వలసలను రాబోయే రోజుల్లో నివారిస్తామని తెలిపారు. ఇళ్లు కోల్పోయేవారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం, ఇళ్లస్థలం లేదా ఇళ్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బులు కేటాయిస్తామని తెలిపారు. ఇల్లు వద్దనుకునేవారికి వన్ టైం సెటిల్మెంట్ క్రింద పరిహారం ఇస్తామని, రవాణా చార్జీలతో సహా గౌరవప్రదమైన పరిహారం ఇవ్వబడుతుందని సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు