తిరుమల: అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆరు అడుగుల పొడవైన నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఎన్ఎస్ ఆలయానికి సమీపంలో నాగుపామును చూసిన స్థానిక సిబ్బంది... టీటీడీ అటవీ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
‘బర్డ్’లో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు
తిరుపతి తుడా: గ్రహణం మొర్రితో బాధపడుతున్న పేద పిల్లలకు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి శుక్రవారం తెలిపారు. శస్త్రచికిత్సల కోసం ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అపాయింట్మెంట్, ఇతర వివరాల కోసం 7337318107 నంబరులో సంప్రదించాలని సూచించారు. (క్లిక్: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!)