ఇంత జరిగాక సీఐడీ దర్యాప్తు ఆపమని చెప్పలేం: ఏపీ హైకోర్టు

22 Sep, 2023 14:28 IST|Sakshi

సాక్షి, కృష్ణా:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది.  ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. 

క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్‌ డిస్మిస్డ్‌’ అంటూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్‌ ఆర్డర్‌ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది.

విచారణ కీలక దశలో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్‌ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలి. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయొచ్చు. విచారణలో ఎఫ్‌ఐఆర్‌ మెరిట్స్‌ మీద కేసును అడ్డుకోకూడదు. సీఆర్‌పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్‌ నిర్వహించలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదించారు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) రెండ్రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే


హైకోర్టు ఆర్డర్‌ పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు