ఏపీ విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్ మ‌ణిహారం..

23 Apr, 2021 20:45 IST|Sakshi

•    విద్యార్థుల‌కు 42 ర‌కాల నైపుణ్య కోర్సులు•    1.60ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు సౌల‌భ్యం•    ప్ర‌తి విద్యార్థికీ వంద‌ డాల‌ర్ల బ‌హుమ‌తి కూప‌న్•    మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ప్ర‌య‌త్నం•    కోర్సు పూర్తీకాగానే విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్ స‌ర్టిఫికెట్లు•    ప్ర‌తి విద్యార్థీ ఉద్యోగార్హ‌త పొందే అవ‌కాశం•    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందం•    వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగిన కార్య‌క్ర‌మం

అమ‌రావ‌తి:  ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, తన చరిత్రలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఆరంభించింది. రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచి, నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా  అన్వేషిస్తున్న సంస్థలు, కంపెనీలకు  ఒక చిరునామాగా  ఏపీని తీర్చిదిద్దే బృహ‌త్  కార్య‌క్ర‌మానికి మైక్రోసాఫ్ట్ శ్రీకారం చుట్టింది.

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, ఉన్నత విద్యారంగంలో తీసుకొస్తున్ విప్లవాత్మక మార్పులు మైక్రోసాఫ్ట్ సంస్థను ఆకట్టుకుంది. దాంతో  రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాల మధ్య  శుక్రవారం వర్చువల్ విధానంలో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ కార్య‌క్ర‌మంలో  రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి,  విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ ఆచార్య హేమ‌చంద్రారెడ్డి, సీఎం కార్యాల‌య విదేశీ విద్యావ్య‌వ‌హారాల అధికారి డాక్ట‌ర్ హ‌రికృష్ణ‌, రాష్ట్ర ప్ర‌భుత్వ విదేశీ విద్య కో ఆర్డినేట్ డాక్ట‌ర్ కుమార్ అన్న‌వ‌ర‌పు, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మ‌హేశ్వ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. వ‌ర్చువ‌ల్ విధానంలో అవ‌గాహ‌న ఒప్పందంపై సంత‌కాల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వంలో క‌లిసి పనిచేయ‌డానికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ముందుకు రావ‌డం ముదావ‌హ‌మ‌న్నారు.

 రాష్ట్రంలోని విద్యా యువ‌త‌కు మైక్రోసాఫ్ట్ అందించ‌రే డిజిట్ నైపుణ్య సాధ‌న ఎంతో ఊత‌మిస్తుందాని, ఈ శిక్ష‌ణ పొంద‌డం ద్వారా యువ‌త ఉద్యోగం పొందే అవ‌కాశాలు త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌న్నారు. డిజిట‌ల్ క‌నెక్ట్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఇంటికీ చేరువ కానుంద‌ని, దాదాపు 80 ల‌క్ష‌ల గృహాల‌కు డిజిట‌ల్ క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. 
మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో జ‌రిగిన ఈ అవ‌గాహ‌న ఒప్పందం వ‌ల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు వృత్తి విద్యా క‌శాళాల విద్యార్థుల‌కు ఎంత‌గానో ఉప‌యోక‌రంగా ఉంటుంద‌న్నారు.

క‌ళాశాల‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే విద్యార్థుల‌కు ముంద‌గానే మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌డం స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం ద్వారా వారు మంచి అవకాశాలు పొంద‌డానికి మార్గం సుగ‌మ‌మ‌వుతుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్ రాష్ట్ర విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొస్తున్నార‌ని, ఉన్న‌త విద్య‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన విద్య‌ను యువ‌త‌కు అందించాల‌నే సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ఈ ప్ర‌య‌త్నాల‌కు ఇప్ప‌డు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ‌లు జ‌త‌క‌ల‌వ‌డం మ‌రింత ఉప‌యుక్తంగా ఉంటుంద‌న్నారు. 
రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ఆచార్య హేమ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల‌కు 42 ర‌కాల‌కు పైగా నైపుణ్య శిక్ష‌ణ‌లు ఇవ్వ‌డం వ‌ల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగై వారు మంచి అవ‌కాలు పొంద‌డానికి ఇది ఊత‌మిస్తుంది అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మ‌హేశ్వ‌రి మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాము ఎంతో ఉత్సుక‌త‌తో ఉన్నామ‌న్నారు.

దేశంలో డిజిట‌ల్ ఎకాన‌మీలో ప్ర‌తి ఒక్క‌రూ విజ‌యం సాధించాలంటే ఈ డిజిట‌ల్ స్కిల్లింగ్ అనేది ఒక పునాదిలాగా ప‌నిచేస్తుంద‌న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని యువ‌త‌లో నైపుణ్యాల‌కు ప‌దునుపెట్టి వారు మంచి ఉద్యోగావ‌కాశాలు పొంద‌డానికి స‌హ‌క‌రించేలా ప‌నిచేయ‌డానికి తాము  కంక‌ణ‌బ‌ద్ధులైనామ‌ని తెలిపారు. ఏపీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి త‌మ‌కు స‌హ‌క‌రించిన ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

ఏమిటీ కోర్సులు
మైక్రోసాఫ్ట్ సంస్థ త‌న చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టిసారిగా ఇలాంటి వినూత్న విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శ్రీకారం చుట్టింది.   ప్ర‌భుత్వ  స‌హ‌కారంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా  క‌ళాశాల‌ల్లోని విద్యార్థుల‌కు వివిధ ర‌కాల నైపుణ్యాల‌లో శిక్ష‌ణ ఇవ్వ‌నుంది.  స‌మ‌కాలీన ప్ర‌పంచంలో వ‌స్తున్న సాంకేతిక మార్పుల‌కు అనుగుణంగా విద్యార్థుల్లో  వృత్తి నైపుణ్యాల‌కు ప‌దునుపెట్టి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నుంది. ఇందుకోసం ప్ర‌త్యేకించి 42 ర‌కాల కోర్సుల‌ను విద్యార్థుల‌కు అందించ‌నుంది. 1.60ల‌క్ష‌ల మందికిపైగా  ఈ కోర్సులు అందించ‌నున్నారు.
మొత్తం 42 ర‌కాల కోర్సులుంటాయి. కోర్సులను బ‌ట్టి మొత్తం 40 గంట‌ల నుంచి 160 గంట‌ల వ్య‌వ‌ధి శిక్ష‌ణ ఇస్తారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏడు ర‌కాల అజ్యూర్ (Azure DevOps)టెక్నాల‌జీ కోర్సులు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, సైబ‌ర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్ డైన‌మిక్స్ 365, ప‌వ‌ర్ యాప్ ఫండ‌మెంట‌ల్స్‌, అజ్యూర్ డాటా అన‌లిటిక్స్‌, డాటాబేస్ త‌దిత‌ర 42 ర‌కాల సాంకేతిక నైపుణ్య కోర్సులు ఇందులో ఉంటాయి. వీటికి మైక్రోసాఫ్ట్ నుంచి సుశిక్షితులైన నిపుణుల ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను అందిస్తారు. అలాగే ఉద్యోగాల‌కు జ‌రిగే ఇంట‌ర్వ్యూల‌కు ఎలా సంసిద్ధం కావాలి, వేష భాష‌ల‌తో పాటు, నైపుణ్యాల‌పైనా శిక్ష‌ణ ఇస్తారు.

ఈ  త‌రగ‌తుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన స్థానికంగా వ‌న‌రుల స‌హ‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తుంది. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థి ప్రొఫైళ్లను  లింక్డిన్లో అప్డేట్, అప్లోడు చేస్తారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆ నైపుణ్యాలున్న వారికోసం అన్వేషిస్తున్న సంస్థలకు లింక్డిన్ ద్వారా ఈ ప్రొఫైళ్లను పంపి,  తద్వారా విద్యార్థులు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి ఉద్యోగాలు పొందే వీలు కల్పిస్తారు. 

75 శాతం ఉద్యోగాలు నైపుణ్యుల‌కే
రోజురోజుకీ సాంకేతిక ప్ర‌పంచం కొత్త‌పుంత‌లు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాల‌జీ పుట్టుకొస్తోంది. పోటీత‌త్వం పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల‌ను, ప‌రిశ్ర‌మ‌ల‌ను నైపుణ్య‌మున్న మాన‌వ వ‌న‌రుల కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల విద్యార్హ‌త‌ల‌కంటే వారిలోని నైపుణ్యార్హ‌త‌ల‌కే సంస్థ‌లు పెద్ద‌పీఠవేస్తున్నాయి. సాంకేతిక మాన‌వ వ‌న‌రుల కొర‌తైతే మరింత తీవ్రంగా ఉంది.

రాబోయే ప‌ది సంవ‌త్స‌రాల్లో సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌ల్లోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలకు  సాంకేతిక నైపుణ్యం ఉన్న‌వారే అవ‌స‌రం. ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు సరిపడా నైపుణ్యాలున్న మానవ వనరులు కనీసం 50శాతం మంది కూడా లభించడం లేదు. ఇందులోనూ 71 శాతం స్టెమ్ జాబ్స్ అన్నీ కూడా కంప్యూటింగ్ రంగంలోనే ఉన్నాయి. ఈ డిమాండును కేవ‌లం 8శాతం కంప్యూటింగ్ ప‌ట్ట‌భ‌ద్రులు మాత్ర‌మే పూర్తి చేయ‌గ‌లుగుతున్నారు. దీన్ని బట్టీ  రంగంలో నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఎంతటి డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు. 

విద్యార్థుల‌కు ఎంతో మేలు
మైక్రోసాఫ్ట్ చేప‌ట్ట‌బోయే ఈ కార్య‌క్ర‌మం ద్వారా మ‌న రాష్ట్ర విద్యార్థుల‌కు అనేక అవ‌కాశాలున్నాయి. పోటీ ప్ర‌పంచంలో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డంలో మ‌న‌వాళ్లు ముందుండే అవ‌కాశాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ క‌ల్పించ‌నుంది. కోర్సులు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా కోర్సు పూర్తి చేసిన ప్ర‌తి విద్యార్థికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు, అనంత‌రం విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ స‌ర్టిఫికెట్ అంద‌జేస్తుంది. ఈ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండ‌ట‌మ‌నేది ఉద్యోగాలు పొందడానికి ఆ విద్యార్థికి అద‌నపు అర్హ‌త‌వుతుంది. ఉద్యోగాలకు నిర్వ‌హించే ఎంపిక ప్ర‌క్రియ‌లో ఈ స‌ర్టిఫికెట్ పొందిన విద్యార్థుల‌కు సంస్థ‌లు అత్య‌ధిక ప్రాధాన్యమిస్తాయి. 

ప్ర‌తి విద్యార్థికీ వంద డాల‌ర్ల బ‌హుమ‌తి
ఈ కోర్సులు చేసే ప్ర‌తి విద్యార్థికీ మైక్రోసాఫ్ట్ సంస్థ వంద డాల‌ర్ల బ‌హుమ‌తి కూడా అందించ‌నుంది. దానికి సంబంధించి ప్ర‌తి విద్యార్థికీ బ‌హుమ‌తి కూప‌న్ ఇవ్వ‌నుంది. దీనిద్వారా వారు త‌మ నైపుణ్యాల‌ను మ‌రింత లోతుగా ప‌దునుపెట్టుకోవ‌డానికి వీటిని ఉప‌యోగించుకునే వీలు క‌లుగుతుంది.

మరిన్ని వార్తలు