ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌లో అగ్ని ప్రమాదం

18 Oct, 2020 08:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై ఎస్‌వీకేడీటీ (SVKDT ) ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి విజయవాడకు వస్తున్న బస్సు ప్రసాదంపాడులోని ఎస్వీఆర్ సెంటర్‌కు వచ్చేసరికి బస్సు టైర్ పగిలింది. టైర్ పగిలిన ధాటికి ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి. దీనితో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ఏమి జరిగిందో తెలియక అయోమయంలో బస్సు కిటికీ నుండి కిందకు దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే బస్సు టైర్ పగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

సిటీ బస్సును ఢీకొన్న మినీ వ్యాన్‌
మరోవైపు గన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్‌ నుంచి బయటకు వస్తున్న సిటీ బస్సును మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

మరిన్ని వార్తలు