యువతి ద్విచక్ర వాహనంలో దూరిన తాచు

18 Feb, 2021 08:45 IST|Sakshi

తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఒక్కసారిగా బండిలో నుంచి తాచుపాము బయటికొచ్చి పడగ విప్పి పైకి లేస్తే.! అమ్మో.. ఇంకేమైనా ఉందా? అంటారా? పైగా ఓ యువతి వాహనం నడుపుతుండగా.. సరిగ్గా అదే జరిగింది గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో. బుధవారం చోటుచేసుకున్న ఈ  ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిలోని కొత్తూరుకు చెందిన ఝాన్సీ ఇంటి దగ్గర నుంచి ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణమైంది.

ఉండవల్లి సెంటర్‌లోని తాడేపల్లి రోడ్డులోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం ఎదుటి డోమ్‌లో నుంచి తాచుపాము ఒక్కసారిగా పడగ విప్పి పైకి లేచింది. భయంతో బిత్తరపోయిన ఝాన్సీ బండిని వదిలేసింది. దీంతో కంగారు పడ్డ పాము మళ్లీ ద్విచక్రవాహనం లైట్‌ డోమ్‌లోకి వెళ్లింది. ఈ లోగా స్థానికులు అక్కడికి చేరుకోగా, వాహనంలో పాము ఉన్న విషయాన్ని యువతి వారికి తెలిపింది. దీంతో వారు మెకానిక్‌ సాయంతో ద్విచక్రవాహనం డోమ్‌ విప్పదీసి, పామును బయటకు తీసి చంపేశారు. రెండు గంటల పాటు పాము బండిలోనే అటూఇటూ తిరగడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
చదవండి: దారుణం: పాము మెడకు కండోమ్‌..  
ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో..

>
మరిన్ని వార్తలు