గురుకులం నుంచి ఆస్ట్రేలియాకు..  

9 Jan, 2021 12:59 IST|Sakshi

సాక్షి, రాయదుర్గం: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డికి చెందిన పూర్వ విద్యార్థి మనోజ్ఞ ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్‌ యూనివర్సిటీలోని ఐఈఎల్‌టీఎస్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోర్సుకు ఎంపికైంది. 6.5/9 మార్కులతో 50 శాతం ఉపకార వేతనంతో ఆమె ఈ కోర్సులో చేరేందుకు అవకాశం లభించడం విశేషం. 2019–20 విద్యాసంవత్సరంలో గౌలిదొడ్డి గురుకులంలో మనోజ్ఞ ఎంఈసీ గ్రూపులో 921/1000 మార్కులు సాధించింది. జాతీయ స్థాయి సీఎంఏ ఫౌండేషన్‌లో అర్హత కూడా సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌ అంబటిపూడి శారద మాట్లాడుతూ మనోజ్ఞ ప్రస్తుతం కోఠి మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతోందన్నారు. ఆమె అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం గర్వంగా ఉందని, ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి ఆర్‌.శారద, ఓఎస్‌డీ రంగారెడ్డి, కామర్స్‌ అధ్యాపకులు గోపీనాథ్, ఇతర అధ్యాపకులు ఆమెను అభినందించారు. 

మరిన్ని వార్తలు