సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో పనులు ప్రారంభం

27 Jul, 2020 10:48 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: కరోనా కాటుతో యావత్‌ భారతం లాక్‌డౌన్‌లో చిక్కుకు పోయింది. జనజీవనం స్థంభించి ఆర్థిక కుంగుబాటు దిశగా సాగడంతో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనప్పటికీ వ్యాపారాలన్నీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు కేవీపల్లి మండలం మహల్‌కు చెందిన నాగేశ్వర్‌రావు పరిస్థితి కూడా ఈ కోవలోనిదే. కరువు కాటకాలవల్ల కుటుంబంతో సహా గ్రామం వదలిన ఆయన మదనపల్లిలో ఏడాదిగా టీకొట్టు నడిపిస్తున్నాడు. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌తో పరిస్థితి తల్లకిందులైంది. చేసేదేమీ లేక తిరిగి ఇంటిబాట పట్టాడు. వర్షాలు కూడా పడటంతో ఉన్న భూమిలోనే వ్యవసాయానికి సిద్ధమయ్యాడు. అయితే, ఎద్దులు కొనే స్థోమత లేకపోవడంతో ఇద్దరు కుమార్తెలు, భార్య సాయంతో  సాగు ప్రారంభించాడు.
(చదవండి: రైతు నాగేశ్వర్‌రావుకు ఏపీ ప్రభుత్వం సాయం వివరాలు)

ఇద్దరు కుమార్తెలు కాడెద్దులుగా మారి సాళ్లు చేయగా.. దంపతులిద్దరు విత్తనాలు వేశారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో స్పందించిన నటుడు సోనూ సూద్‌ వారికి ట్రాక్టర్‌ ఇస్తానని ప్రకటించి, గంటల వ్యవధిలోనే హామీని నిజం చేశారు. నిన్న మధ్యాహ్నం ట్విటర్‌ ద్వారా రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇస్టున్నట్టు చెప్పిన సోనూ, సాయంత్రం తన మనుషుల ద్వారా ట్రాక్టర్, రోటవేటర్‌ను రైతు నాగేశ్వరరావు కుటుంబానికి అందించారు. దీంతో ఆ రైతు కుంటుంబం ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందంలో మునిగిపోయింది. తమ కష్టాలను తీర్చిన సోనూ సూద్‌ చల్లగా ఉండాలని రైతు కుటుంబం వ్యాఖ్యానించింది. రియల్‌ హీరోకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో రైతు నాగేశ్వర్‌రావు సోమవారం ఉదయం వ్యవసాయ పనులు ప్రారంభించాడు. 
(సోనూ.. నువ్వు సూపర్‌)

మరిన్ని వార్తలు