వారియర్స్‌ ‘కేర్‌’ 

13 Sep, 2020 09:42 IST|Sakshi
కోవిడ్‌కేర్‌ సెంటర్‌లోని వసతులు

50 పడకలతో డీటీసీలో అధునాతన సౌకర్యాల కల్పన 

హోంగార్డులకు అధిక ప్రాధాన్యం

25 ఆక్సిజన్‌ బెడ్లు, 25 సాధారణ బెడ్లు

పోలీసు శాఖలో ఇప్పటి వరకు 620 మందికి పాజిటివ్‌ 

కరోనా విపత్తులో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా రేయింబవళ్లు సేవలందిస్తున్న పోలీసుల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిరంతరం రోడ్లపై తింటూ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటున్నారు. వైరస్‌ కట్టడికి తమ వంతు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో వీరు ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. పోలీసు శాఖలో పాజిటివ్‌ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బంది ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కలి్పంచడానికి ఎస్పీ భాస్కర్‌భూషణ్‌  ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రత్యేకంగా పోలీసుల కోసం 50 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వైఫై, టీవీ, ఆక్సిజన్‌ సిలిండర్ల తోపాటు ఇతర అత్యాధునిక సౌకర్యాలను కలి్పంచారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోస్తా జిల్లాలోనే ప్రప్రథమంగా అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నెల్లూరులో ఏర్పాటైంది. ఒకటి.. రెండు జిల్లాల్లో ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ లోపాలు, ఇతర సమస్యలతో సక్రమంగా పని చేయని పరిస్థితి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  

నెల్లూరు డి్రస్టిక్ట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో అధునాతన సౌకర్యాలతో 50 పడకలతో దాతల సహకారం, పోలీసు శాఖ నిధులతో కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
50 పడకల్లో 25 ఆక్సిజన్‌ బెడ్లు, 25 సాధారణ బెడ్ల ఏర్పాటుతో పాటు అదనంగా ఆక్సిజన్‌ సిలిండర్లను సెంటర్‌లో ఏర్పాటు చేసి పోలీసు శాఖకు సంబంధించిన డాక్టర్‌ను పూర్తిగా సెంటర్‌కు కేటాయించారు.  
పాజిటివ్‌ రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వైఫై, టీవీతో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సెంటర్‌కు అవసరమైన మాసు్కలు మొదలు విటమిన్‌ టాబ్లెట్ల వరకు అన్నింటిని జిల్లా యంత్రాంగం సమకూర్చి అధునాతన సౌకర్యాలతో సిద్ధం చేసి ఈ నెల 10న ప్రారంభించారు.   

620కిపైగా కేసులు  
జిల్లాలో పోలీసు శాఖలో కరోనా కేసుల తీవ్రత కొంత అలజడిగా ఉంది. కోవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం బందోబస్తు, పికెట్‌ విధుల్లో ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు. 
బారాషహీద్‌ దర్గా ఉత్సవాలు, వెంకటగిరి పోలేరమ్మ జాతర, ప్రముఖుల పర్యటనలతో పోలీసు శాఖ నిరంతరం బిజీబిజీగా ఉంది.  
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 620 కేసులు ఒక్క పోలీసు శాఖలోనే నమోదయ్యాయి.  
వీరిలో 121 మంది మాత్రమే చికిత్స పొందుతుండగా మిగిలిన వారందరూ పూర్తిగా కోలుకుని ఎక్కువ మంది విధులకు కూడా హాజరవుతున్నారు.  
పోలీసులకు ప్రత్యేకంగా కోవిడ్‌కేర్‌ సెంటర్‌ ఉంటే మరింత మెరుగైన వైద్యం అందుతుందని భావించి సెంటర్‌ను వారం రోజుల వ్యవధిలో ఏర్పాటు చేశారు.  

హోంగార్డు, కానిస్టేబుళ్ల కోసమే..
ప్రధానంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఎక్కువ మంది కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. హోం గార్డులు, కొంత మంది కానిస్టేబుళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో సరైన వైద్యం కూడా పొందలేని పరిస్థితి. వారి ఇళ్లు కూడా చిన్నవిగా ఉండడంతో పాజిటివ్‌ వస్తే హోమ్‌ ఐసొలేషన్లో కాకుండా తప్పని సరిగా హాస్పిటల్‌కే వెళ్తున్న కేసులు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఎస్పీ ఈ కేసులను పరిశీలించి ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేసి హోంగార్డులు, కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే కేర్‌ సెంటర్‌లో ఉండేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి మరి కొన్ని బెడ్లు పెంచడంతో పాటు మరో డాక్టర్‌ను కేటాయించనున్నారు. 50 మంది రోగులకు రెండు పూటలా ఆహారంతో పాటు న్యూట్రిషన్స్‌ ఉన్న డైట్‌ను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పాజిటివ్‌ కేసులను అడ్మిట్‌ చేసుకుంటున్నారు.

పోలీస్‌కు ఆరోగ్య భరోసా కల్పిస్తాం 
కోవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న పోలీసులకు ఆరోగ్య భరోసా కలి్పంచడం ఎస్పీగా నాపై బాధ్యత ఎంతో ఉంది. సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపుతూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేకంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆహారం నుంచి మందుల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అవసరాన్ని బట్టి మరిన్ని బెడ్లు ఏర్పాటు చేస్తాం. 
– భాస్కర్‌భూషణ్, ఎస్పీ   

మరిన్ని వార్తలు