దిశ యాప్‌ వినియోగంపై స్పెషల్‌ డ్రైవ్‌

24 Jun, 2021 04:35 IST|Sakshi

హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడి 

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం బుధవారం ఆమె తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. దిశ యాప్‌ వినియోగంపై స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్‌పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలన్నారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశ యాప్‌పై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని తెలిపారు. పెట్రోలింగ్‌ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 

మరిన్ని వార్తలు