లిక్విడ్‌ బదులు జెల్‌ శానిటైజర్లు విక్రయించాలి

11 Aug, 2020 12:10 IST|Sakshi

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ ఎస్పీ  ఆరీఫ్‌ హఫీజ్‌ 

సత్తెనపల్లిలోని మెడికల్‌ షాపుల్లో తనిఖీలు

సత్తెనపల్లి: లిక్విడ్‌ శానిటైజర్‌ బదులు జెల్‌ శానిటైజర్లు మాత్రమే విక్రయించాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. పట్టణంలోని పలు మెడికల్‌ షాపుల్లో సోమవారం ఆయన తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ మరణాల తరువాత స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. మెడికల్‌ షాపుల వద్ద ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. శానిటైజర్‌ తయారీదారులు, మెడికల్‌ షాపుల నిర్వాహకులు, మెడికల్‌ షాపుల అసోసియేషన్లతో మాట్లాడి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మద్యం అక్రమ సరఫరాలో పాత నిందితుల్ని బైండోవర్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు సత్తెనపల్లి అర్బన్‌ సీఐ ఎస్‌.విజయచంద్ర, సిబ్బంది ఉన్నారు.

>
మరిన్ని వార్తలు