మహానేతా..అందుకో మా జోత
పశ్చిమ అభివృద్ధిపై ప్రత్యేక ముద్ర
సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం
పోలవరంతో డెల్టా సస్యశ్యామలం
ఇప్పటికే కాఫర్ డ్యామ్ పనులు పూర్తి
గిరిజనులకు భూప్రదాతగా నిలిచిన వైనం
ఉద్యాన వర్సిటీతో పరిశోధనలకు ఊతం
నేడు దివంగత వైఎస్సార్ జయంతి
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఉద్యాన వర్సిటీని స్థాపించి ఉద్యాన రైతులకు ఆసరాగా నిలిచారు.. ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. ఆరోగ్యశ్రీ, 108లతో ప్రాణదాతగా నిలిచారు.. నీటిపారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు. అడుగడుగునా తన గురుతులతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. గురువారం ఆయన జయంతి సందర్భంగా మహానేతా.. అందుకో మా జోత అంటూ పశ్చిమవాసులు నివాళులర్పిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: పశ్చిమగోదావరి సమృద్ధిగా ఉండాలి. అన్నదాతకు సాగు కష్టాలు తీరితేనే అంతా బాగుంటుంది. అవసరాలకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వగలితే అంతా చేసినట్టే ఇది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నమ్మినమాట. దానిని ఆచరణలో పెట్టడంతో ‘పశ్చిమ’ ముఖ చిత్రం మారేలా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శాశ్వతంగా తన ముద్ర ఉండేలా మేలు చేశారు.
గిరిజనులకు పట్టాలు
జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు సుమారు 30 వేల ఎకరాల పోడు భూములకు గాను వైఎస్సార్ పట్టాలిచ్చారు. గిరిజన ప్రాంతంలోని సుమారు 1,700 మంది గిరిజన పోడు భూమి రైతులకు 6,500 ఎకరాలకు పట్టాలను అందించడంతో పాటు భూములను సాగులోకి తీసుకువచ్చేలా బోర్లు వేయించి విద్యుత్ సదుపాయం కల్పించారు.
ఉద్యాన’ వెలుగులు
తాడేపల్లిగూడెంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఉద్యాన సాగు అభివృద్ధితో పాటు యువతకు విద్యావకాశాలు కల్పించేలా ఆయన తీసుకున్న చొరవ చిరస్మరణీయం.
పోగొండ జలాలు
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తికావడంలో వైఎస్సార్ చొరవ ఉంది. ప్రస్తుతం సుమారు 7,600 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందంటే అది ఆయన చలువే.