టెక్‌ తపాలా..

12 Oct, 2022 10:27 IST|Sakshi

కొత్త ప్రణాళికలు, పథకాలతో ప్రజలకు దగ్గరవుతున్న పోస్టల్‌ శాఖ 

బ్యాంక్‌లకు దీటుగా ఆర్థిక సేవలు 

గ్రామీణ ప్రజలకు సేవలు      

9 నుంచి 13 వరకు పోస్టల్‌ వారోత్సవాలు

పోస్టాఫీసులంటే టక్కున గుర్తువచ్చేవి ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు. కాలం మారింది. దూరాలను దగ్గరగా చేసిన పోస్టల్‌ శాఖ సాంకేతిక విప్లవంతో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేక ప్రజలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అదే సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వినూత్న పథకాలు, ప్రణాళికలతో ‘దూరం నుంచి దగ్గర’ అవుతోంది. ఇప్పటికే పోస్టల్‌ ఖాతాలను జాతీయ బ్యాంకుల తరహాలో ఆన్‌లైన్‌ చేసింది. ఏటీఎం కార్డులను జారీ చేస్తూ.. ఏటీఎంలను ప్రారంభించిన ఈ శాఖ  మరో అడుగు ముందుకేసి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్సు సంస్థల కంటే మిన్నగా ఆర్థిక సేవలను వేగంగా అందిస్తోంది. ప్రజలకు ఆత్మబంధువులా చేరువవుతోంది.  

మార్కాపురం: టెక్నాలజీ లేని కాలంలో గ్రామీణ ప్రజలకు పోస్టాఫీసులే దిక్కు. ఉత్తరాల దగ్గర నుంచి అత్యవసర సేవల కోసం ప్రజలు వీటినే ఆశ్రయించే వారు. ఉత్తరాలు, ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, మనియార్డర్లతో ఖాకీ డ్రెస్‌ వేసుకుని ప్రతి రోజూ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఎందరో ఆశలకు జీవం పోసి ఉత్సాహపరుస్తూ ఆతీ్మయులుగా ఉండేవారు పోస్టుమేన్‌లు. నేడు పరిస్థితి మారింది. సమాచారాన్ని క్షణాల్లో మన ముందుంచేలా పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే స్థాయిలో పోస్టల్‌ శాఖ కూడా మారుతూ వచ్చింది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది. అత్యాధునిక సేవలను వినియోగదారులకు అందిస్తూ పోటీ పడుతోంది. 

సెల్‌ఫోన్‌ రాకతో.. 
సెల్‌ఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ సాంకేతికంగా వస్తున్న మార్పులను ప్రజలకు అందించేందుకు తపాలాశాఖ సిద్ధమైంది. పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాలు కొని డబ్బాలో వేసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. ప్రస్తుతం వాట్సాప్, ట్విట్టర్‌ ద్వారా సమాచార మారి్పడి చేసుకుంటున్నారు. మనీయార్డర్ల స్థానంలో ఏటీఎంలు, మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటివి వచ్చాయి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఈ మెయిల్స్‌ పోటీ తట్టుకోవటంలో వెనుకబడిన తపాలా శాఖ ఇప్పుడిప్పుడే వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల ఆదరణ చూరగొంటోంది. 

టెక్‌ సాయంతో ముందడుగు..
ప్రైవేటు సంస్థలు, బ్యాంక్‌లకు దీటుగా పోస్టాఫీసుల్లో కూడా ఆన్‌లైన్‌ సేవలు, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు, పుష్కరాల సమయంలో ఆ ప్రాంత పుష్కరాలను తెలియజేస్తూ కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర జలాల లీటర్, అర్ధ లీటర్‌ బాటిల్స్‌ తక్కువ రేటుకు ప్రజలకు అందిస్తూ వారి అభిమానాలను చూరగొంటోంది. మొబైల్‌ మనీ ట్రాన్స్‌ఫర్, ఎల్రక్టానిక్‌ మనీయార్డర్, మై స్టాంప్‌ పథకం, స్పీడ్‌ పోస్టుల సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వివిధ వర్గాల ప్రజలు మళ్లీ పోస్టాఫీసుకెళ్తున్నారు.

విదేశాల్లో ఉన్న బంధు మిత్రుల నుంచి క్షణాల్లో నగదు బదిలీ, ప్రైవేటు కొరియర్స్‌ కంటే ముందుగా వెళ్తున్న స్పీడ్‌ పోస్టు, వ్యక్తిగతంగా ఫొటోలతో విడుదల చేసే మై స్టాంప్, రికరింగ్‌ డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పథకాలు ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో అత్యవసరమైన మందులను పోస్టల్‌శాఖ వారు అందించారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ను పోస్టల్‌ శాఖ ప్రారంభించింది. పోస్టల్‌ సిబ్బందికి బయోమెట్రిక్‌ మిషన్‌ అందించారు. దీని ద్వారా బ్యాంకు అకౌంట్‌ ఉంచి ఐపీపీబీలో అకౌంట్‌ కలిగి ఉంటే పోస్టల్‌ సిబ్బంది బయోమెట్రిక్‌ వేయించుకుని రూ.5 నుంచి రూ.10 వేల వరకూ వారే ఇంటికి వచ్చి అందించే సౌకర్యం కల్పించారు.   

మరిన్ని వార్తలు