పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు పూర్తి

21 Feb, 2021 14:44 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయ్యింది. 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై  మేఘా ఇంజినీరింగ్ సంస్థ అమర్చింది. షట్టరింగ్‌, స్లాబ్ నిర్మాణంపై  నిపుణులు దృష్టి పెట్టారు. గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్‌, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గోదావరికి భారీ వరద వచ్చినా పనులు ఆగకుండా స్పిల్‌వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ఇంజినీరింగ్‌ ప్రణాళికలు రూపొందించారు.

కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని శుక్రవారం క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో అన్వయించారు.


చదవండి: పోలవరం పెండింగ్‌ డిజైన్లు కొలిక్కి
2022 నాటికి పోల‌వ‌రం పూర్తి: ఏబీ పాండ్యా

మరిన్ని వార్తలు