వేదనల చీకటిలో విద్యా కాంతులు

18 Jul, 2021 11:01 IST|Sakshi
పిల్లలతో దాతలు

సాక్షి,కాకినాడ: కోవిడ్‌ భయానక వేళ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏనాడూ బయటికైనా రాని ఇంటి మహాలక్ష్మి.. భవిత కోసం, బిడ్డల బాగు కోసం వేదన నిండిన హృదయంతో తల్లడిల్లుతోంది. అటువంటి ఎందరో తల్లుల ఆక్రందనలు ‘శ్రీయువసేన’ గుండెను తాకాయి. బిడ్డ భవిత కోసం వేదన పడే ప్రతి తల్లి గుండె చప్పుడుకూ శ్రీ యువసేన సేవా సంఘం అండగా నిలిచింది. వారి పిల్లల చదువులకు సంఘం చైర్మన్‌ బొల్లం సతీష్‌ భరోసా కల్పించారు. దాతల తలుపు తట్టారు. వారి సహాయంతో జిల్లా వ్యాప్తంగా 20 మంది పిల్లల భవితకు భద్రత కల్పించారు. వారి చదువుకు భరోసా దక్కింది.
బాధితులతో సమావేశం
తండ్రిని కోల్పోయిన బాలలు, వారి తల్లులతో శనివారం కాకినాడ భానుగుడి కూడలిలోని లా వెంటో ఫంక్షన్‌ హాలులో శ్రీ యువసేన సేవా సంఘం ఛైర్మన్‌ బొల్లం సతీష్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో సతీష్‌ మాట్లాడుతూ బాధిత బిడ్డల విద్యకు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు హేమంత్‌ కుమార్, శశాంక్‌ అగర్వాల్, ఆయుష్‌ అగర్వాల్, ఖుషి అగర్వాల్, కొమ్మిశెట్టి హర్ష ముందుకొచ్చారని తెలిపారు. దాతల తరఫున హేమంత్‌ కుమార్‌ మాట్లాడారు. శ్రీయువసేన సేవా కార్యక్రమాల్లో మమేకమై పేద పిల్లల భవిత నిర్మాణానికి భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను వారి తల్లుల అభీష్టం మేరకు ఎక్కడ కావాలంటే అక్కడే చదివిస్తామని హామీ ఇచ్చారు. జీవితంలో స్థిరపడే వరకూ ఏం చదవాలన్నా చదివిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు