అసలేం జరిగింది.. 7.30కు కుటుంబంతో ఫోన్‌ మాట్లాడాడు.. 12 గంటలు అయ్యేసరికి..

5 Jul, 2022 13:59 IST|Sakshi

సాక్షి,నందిగాం: మండలంలోని మొండ్రాయివలస పంచాయతీ సుబ్బమ్మపేటకు చెందిన ఆర్మీ జవాన్‌ కోనారి ధర్మారావు(37) తను విధులు నిర్వహిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆత్మహ త్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోనారి సూరయ్య, సాయమ్మ దంపతులకు ఇద్దరు మగ పిల్లల్లో చిన్న వాడైన ధర్మారావు 2003లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన సంబరాలకు 50 రోజులు సెలవుపై వచ్చి జూన్‌ 26న ఇంటి నుంచి బయల్దేరి విధులకు వెళ్లారు.

ఈ నెల 2న ఉదయం 7.30కు భార్య, కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం 12 గంటలకు అధికారులు ధర్మారావు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తను కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్య, కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండే ధర్మారావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదు. ఆర్మీ అధికారులు మృతదేహాన్ని సోమవారం ఉదయం సుబ్బమ్మపేటకు తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మారావు సోదరుడు కూడా గతంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఇలా బలవన్మరణాలకు పాల్పడడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు.  

చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ కొత్త కార్యాచరణ.. పార్కింగ్‌ స్థలం లేకపోతే మూతే 

మరిన్ని వార్తలు