‘నా భూమిని కాజేసేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారు’

14 Jun, 2022 10:18 IST|Sakshi
టెక్కలి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో బోరున విలపిస్తున్న రైతు వేణుగోపాలరావు

సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఓ అన్నదాత కన్నీరు పెట్టుకున్నాడు. తన భూమిపై రాబందుల నీడ పడడంతో దాన్నెలా కాపాడుకోవాలో తెలీక బోరున విలపించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు విన్నవిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. టెక్కలి మండలం సీతాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భూమిని కాజేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని, తనతో పాటు భార్య, కుమారుడిని హతమారుస్తానంటూ బెదిరిస్తున్నారని టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన రైతు సత్తారు వేణుగోపాలరావు సోమవారం టెక్కలి ఆర్డీఓ హెచ్‌వీ జయరాంకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కార్యాలయం ఆవరణలోనే బోరున విలపించారు.

ఆయన తెలిపిన వివరాల మేరకు.. 
సీతాపురం సమీపంలో తిర్లంగి రెవెన్యూ గ్రూపు పరిధిలో సర్వే నంబరు 178–2లో వే ణుగోపాలరావుకు సుమారు 66 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిపై గ్రామానికి చెందిన బొరిగి వెంకటరావు అలియాస్‌ సత్యం అనే టీడీపీ కార్యకర్త సాయంతో అతని బంధువు బొరిగి వరహాలనాయుడు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ అన్యాయంపై రైతు అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తన భూమిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి మ్యుటేషన్‌తో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయం పై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు