బిడ్డ మరణించిన మూడు గంటల్లో అమ్మ గుండె ఆగిపోయింది

6 Aug, 2021 09:38 IST|Sakshi

సాక్షి,టెక్కలి(హైదరాబాద్‌): అమ్మ గుండె ఆగిపోయింది. కన్నపేగును యాభై ఏళ్ల పాటు సాకిన తల్లి అతడి వెంటే వెళ్లిపోయింది. నిన్నటి వరకు తన చేతిముద్దను తిని, తన కళ్ల ఎదుట కనిపించిన కొడుకు కన్నుమూసే సరికి మాతృమూర్తి తల్లడిల్లిపోయింది. పైలోకాన తన బిడ్డను ఎవరు చూసుకుంటారోనని మదన పడిందో ఏమో.. మూడు గంటల్లో తనూ తనువు చాలించింది. నెల రోజుల కిందటే ఆ ఇల్లు ఓ మరణాన్ని చూడగా.. మాసం రోజులు తిరిగే సరికి మరో ఇద్దరు కన్నుమూయడంతో ఊరంతా విషాదం అలుముకుంది.

టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయతీ పరిధి జగన్నాథపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. టెక్కలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మెండ బాబురావు (52) అనే దివ్యాంగుడు గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మెండ వరలక్ష్మి (73) మూడు గంటల వ్యవధిలోనే చనిపోయారు. వరలక్ష్మి పెద్ద కుమారుడు మెండ ఆదినారాయణ సరిగ్గా నెల రోజుల కిందటే ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల రోజుల వ్యవధిలో ఒకే ఇంటిలో ముగ్గురు చనిపోవడంతో జగన్నాథపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.   

మరిన్ని వార్తలు